AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: బీజేపీ నేతల మధ్య సమన్వయంపై అమిత్‌ షా సీరియస్‌!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ స్పీడ్‌ పెంచుతోంది. సభలు, సమావేశాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా.. తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలోనూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలను విమర్శించారు షా. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడంతోపాటు.. బీజేపీ నేతల మధ్య సమన్వయంపై షా సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

Ram Naramaneni
|

Updated on: Sep 17, 2023 | 9:57 PM

Share

హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. సికింద్రాబాద్‌ సీఆర్‌పీఎఫ్‌ సెక్టార్‌ నుంచి నేరుగా పరేడ్‌ గ్రౌండ్‌కు వచ్చిన ఆయన… తెలంగాణ సాయుధ పోరాట వీరులకు.. వార్‌ మెమోరియల్‌ వద్ద నివాళులు అర్పించారు. జాతీయ జెండా ఎగురవేసి.. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. పారా మిలటరీ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఎప్పట్లాగే.. అక్కడున్న పుస్తకంలో విమోచన దినోత్సవానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు రాశారు. సాయుధ పోరాట యోధుల గురించి రాసి సంతకం చేశారు అమిత్‌ షా.

తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలోనూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలను విమర్శించారు అమిత్‌ షా. దేశ చరిత్రను ఎవరైతే గౌరవిస్తారో.. ప్రజలు వారి వెంటే ఉంటారన్నారు. దేశ చరిత్ర, స్వాతంత్ర్య సంగ్రామాన్ని గౌరవించే తాము తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఇక.. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం తర్వాత నేరుగా CRPF గెస్ట్‌ హౌస్‌కు వెళ్లిన అమిత్‌ షా బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల, సునీల్‌ బన్సల్‌ పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారాయన. అలాగే.. పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలపైనా చర్చించారు. నేతల మధ్య సమన్వయంపై సీరియస్‌ అయ్యారు. కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని అమిత్‌షా మరోసారి గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తంగా.. నేతల మధ్య సమన్వయంపైనే అమిత్ షా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో.. బీజేపీ ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం