
హైదరాబాద్లో ఓ మహిళకు ఎదురైన చేదు అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉబెర్ డ్రైవర్ నుంచి వచ్చిన అసభ్యకరమైన మెసేజ్ ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. చెప్పడానికి వీలులేని విధంగా వచ్చిన మెసేజ్ ఆమెను షాక్కు గురిచేసింది. ఈ ఘటన బుధవారం (మార్చి 25) చోటుచేసుకుంది. అయితే భయంతో రైడ్ కాన్సిల్ చేయకుండా, బాధిత మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వివరాలను గోప్యంగా ఉంచాలని కోరిన ఆమె, వాట్సాప్ ద్వారా సైబరాబాద్ SHE టీమ్స్కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే స్పందించారు. కేసును BNS సెక్షన్ 292 (పబ్లిక్ న్యూసెన్స్) కింద నమోదు చేసి, గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైడ్ బుక్ చేసుకున్న మహిళకు అసభ్యకరంగా మెస్సెజ్ చేసిన నాగరాజు అనే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి ఫైన్ విధించి విడుదల చేయగా, మరో రెండు రోజుల్లో కౌన్సెలింగ్కు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఘటనపై సైబరాబాద్ SHE టీమ్స్ ఇన్స్పెక్టర్ హనుమాన్ గౌడ్ మాట్లాడుతూ.. బాధిత మహిళ నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని పట్టుకున్నామన్నారు. మహిళల భద్రత విషయంలో ఎల్లప్పుడూ ముందే ఉంటామని..
స్పష్టం చేశారు.
ఈ సంఘటన మరోసారి మహిళల భద్రతపై ఆందోళనలు రేకెత్తించగా, ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..