Cold Wave: చలి పంజా.. వచ్చే 3 రోజులు దుమ్మురేపుతదట.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు అలర్ట్..
ఓ వైపు తీవ్రమైన చలి.. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంతో వర్షాలు.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. అయితే.. తీవ్రమైన చలితో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.

ఓ వైపు తీవ్రమైన చలి.. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంతో వర్షాలు.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. అయితే.. తీవ్రమైన చలితో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే.. తెలంగాణ సహా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కూడా దాటడం లేదు.. ముఖ్యంగా తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD).. భారతదేశం అంతటా చలిగాలులు, వర్షపాతం హెచ్చరికలను జారీ చేసింది. అంచనాల ప్రకారం, నవంబర్ 18-20 మధ్య పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మరాఠావాడ, తెలంగాణ, విదర్భలోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని IMD బులెటిన్ తెలిపింది.
తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో చలిగాలుల హెచ్చరిక
సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్లలో చలిగాలుల కారణంగా యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆసిఫాబాద్, కొమురం భీమ్, నిర్మల్ జిల్లాలతో సహా తెలంగాణలోని మరో ఐదు జిల్లాల్లో నవంబర్ 18న తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది.
సంగారెడ్డి, కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. భూపాలపల్లి జిల్లాలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హనుమకొండ, వరంగల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
ఏపీలో కూడా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
అటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. అల్లూరి జిల్లా మినుములూరులో అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 7.3, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పాడేరులో ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
