హైదరాబాద్లో ‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’ ప్రారంభం.. ఎప్పుడంటే..?
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో హైదరాబాద్కు కేటాయింపు జరిగింది. కళలకు ప్రోత్సాహం, సాంస్కృతిక పునర్వైభవానికి పెద్దపీట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఘంటసాల గారిని స్మరించుకునేలా ‘భారత కళా మండపా’నికి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్య అతిథిగా హాజరుకానున్న భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ సంస్కృతులను, కళలను కాపాడేందుకు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. అందులో భాగంగా.. వివిధ ప్రాంతాల్లో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు, ప్రత్యేక పథకాలను చేపట్టింది. అందులో భాగంగానే.. సంగీతం, నాటకాలు వంటి కళలకు మరింత ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని సంగీత, నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రం (దక్షిణ భారత కేంద్రంగా)ను హైదరాబాద్లో ఏర్పాటుచేయాలని సంకల్పించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
‘దక్షిణ భారతీయ సాంస్కృతిక కేంద్రం’గా పేరు పెట్టిన ఈ వేదిక ద్వారా.. సంగీతం, నృత్యం, నాటకం వంటి కళలను మరింత ప్రోత్సహిస్తూ.. వాటిని తర్వాతి తరాలకు చేర్చేలా కార్యక్రమాలకు రూపకల్పన జరగనుంది. తద్వారా ఇక్కడి సంగీతంతోపాటు జానపదం, గిరిజన కళారూపాలకు, నాటకాలకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది.
కేంద్ర సాంస్కృతిక మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ‘దక్షిణ భారతీయ సాంస్కృతిక కేంద్రం’ శంకుస్థాపన కార్యక్రమానికి భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా.. గానగాంధర్వుడు, పద్మ అవార్డు గ్రహీత శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారి శతజయంతిని 2022-23లో ఏడాదిపాటుగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకమైన ఈ సంగీత, నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రంలో.. ఘంటసాల గారికి సరైన గౌరవాన్ని కల్పిస్తూ.. వారి శతజయంత్యుత్సవాలను పురస్కరించుకుని ‘భారతీయ కళా మండపం’ ఆడిటోరియంను నిర్మించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది.
ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటలకు హైటెక్ సిటీ సమీపంలోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్బంగా సంగీత ప్రపంచంలో ఘంటసాల గారి భాగస్వామ్యన్ని గుర్తుచేసుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
దీంతోపాటుగా, ఈ కార్యక్రమంలోనే.. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ విభూషణ్ పొందిన గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి గారితోపాటుగా పద్మ శ్రీ అవార్డులు పొందిన వారిని కూడా కేంద్ర ప్రభుత్వం తరపున సన్మానించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
