Yashwanth Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కాసేపట్లో హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఆయన రాకకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. యశ్వంత్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. యశ్వంత్ సిన్హా నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. అయితే యశ్వంత్ సిన్హా భాగ్యనగరానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది.
జలవిహార్లో నిర్వహించే సభకు జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు మహమూద్అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతను పరిశీలించారు.
జలవిహార్ వరకు భారీ బైక్ ర్యాలీ
యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, పలువురు ముఖ్యనేతలు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి జలవిహారం వరకు భారీ బైక్ ర్యాలీతో ఊరేగింపుగా యశ్వంత్ సిన్హాను తీసుకురానున్నారు. జలవిహార్లో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇక జలవిహార్లో సభ ముగిసిన తర్వాత యశ్వంత్ సిన్హా కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలతో విడివిడిగా సమావేశం కానున్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం యశ్వంత్ సిన్హా హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి