Khairatabad: ఖైరతాబాద్‌ గణేశుడిని చూసేందుకొచ్చి.. క్యూలైన్‌లో ప్రసవించిన గర్భిణీ!

Ganesh Chaturthi 2025: ఖైరతాబాద్‌ మహా గణనాయకుడి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అక్కడ తొలిపూజ చేయంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా ఖైరతాబాద్‌ బడా గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఓ వింత చోటు చేసుకుంది..

Khairatabad: ఖైరతాబాద్‌ గణేశుడిని చూసేందుకొచ్చి.. క్యూలైన్‌లో ప్రసవించిన గర్భిణీ!
Khairatabad Maha Ganpati Darshan

Updated on: Aug 27, 2025 | 11:59 AM

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 27: వినాయక చవితి సందర్భంగా యావత్ దేశమంతా రకరకాల గణేశ్‌ విగ్రహాలను భక్తి భావంతో ప్రతిష్టించి పూజాది కార్యక్రమాలు మొదలెటేశారు. ఇక హైదారబాద్‌ మహానగరంలో వినాయక చవితి అంటే తొలుత గుర్తుకొచ్చేది ఖైరతాబాద్‌ మహా గణేశుడి భారీ విగ్రహం. నిమజ్జనం వరకు ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహాన్ని చూసేందుకు, దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరుతారనే సంగతి తెలిసిందే. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి ఏడాది ఏదో ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే ఇక్కడి గణనాథుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’‌గా భక్తులకు దర్శనమిచ్చాడు.

దీంతో గణేశుడిని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ఖైరాతాబాద్‌ గణపతి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి‌ దర్శనం కోసం క్యూలైన్‌లో నిలబడి ఉన్న ఓ గర్భిణికి ఉన్నట్టుండి పురిటి నొప్పులు వచ్చాయి. గమనించిన ఉత్సవ కమిటీ సభ్యులు సదరు గర్భిణిని పక్కనే ఉన్న హెల్త్ సెంటర్‌కు తరలించడంతో.. అక్కడ ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు తల్లి, బిడ్డను పరీక్షించి ఇద్దరూ క్షేమమని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ఖైరాతాబాద్‌ గణేశుడి దర్శనానికి వచ్చి స్వామి వారి సన్నిథిలో ప్రసవించడంతో గర్భిణి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రసవించిన గర్భిణీని రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. రేష్మకు ప్రస్తుతం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో వైద్యం అందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.