Hyderabad: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్‌.. డాలర్స్‌ డిమాండ్‌ చేస్తూ డ్రగ్‌ మాఫియా బెదిరింపు ఫోన్‌ కాల్

|

Mar 21, 2024 | 6:44 AM

ఉన్నత విద్య చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపింది. డ్రగ్స్‌ మాఫియా కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్‌ మాఫియాకు చెందిన కిడ్నాపర్లు డబ్బు డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని నాచారంలోనున్న అతని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పారు. అమెరికా డాలర్ల రూపంలో తాము అడిగిన డబ్బు పంపిస్తే అతన్ని వదిలేస్తామన్నారు. లేదంటే కిడ్నీలు..

Hyderabad: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్‌.. డాలర్స్‌ డిమాండ్‌ చేస్తూ డ్రగ్‌ మాఫియా బెదిరింపు ఫోన్‌ కాల్
Hyderabad Student Missing In US
Follow us on

హైదరాబాద్‌, మార్చి 21: ఉన్నత విద్య చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపింది. డ్రగ్స్‌ మాఫియా కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్‌ మాఫియాకు చెందిన కిడ్నాపర్లు డబ్బు డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని నాచారంలోనున్న అతని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పారు. అమెరికా డాలర్ల రూపంలో తాము అడిగిన డబ్బు పంపిస్తే అతన్ని వదిలేస్తామన్నారు. లేదంటే కిడ్నీలు అమ్మేసి సొమ్ము చేసుకుంటామని బెదిరించినట్లు బాధితుడి తల్లిదండ్రులు తెలిపారు. అసలేం జరిగిందంటే..

తెలంగాణ హైదరాబాద్‌ నాచారంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన అబ్దుల్‌ మహమ్మద్‌ (25) 2023లో అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ లో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్నాడు. నిత్యం ఫోన్‌లో మాట్లాడే తమ కుమారుడు అబ్దుల్‌ మార్చి 7వ తేదీ నుంచి అందుబాటులో లేడని అతని తండ్రి మహమ్మద్‌ సలీమ్‌ తెలిపాడు. అప్పటి నుంచి తమ కుమారుడు ఫోన్‌లో అందుబాటులోలేడని, ఫోన్‌ చేసినా స్పందించడం లేదని హైదరాబాద్‌లోని అబ్దుల్‌ బంధువులు చెబుతున్నారు. అతను కిడ్నాప్‌కు గురైనట్లు ఈ క్రమంలో అమెరికాలోని అబ్దుల్‌ ఫ్రెండ్స్‌ ఇన్‌స్టా ఖాతాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టును చూసిన అబ్దుల్‌ సోదరి తల్లిదండ్రులకు తెలిపింది. పైగా అదేవారంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని, తమ కుమారుడిని వారు కిడ్నాప్‌ చేసినట్లు ఫోన్‌లో చెప్పినట్లు తెలిపారు. అతన్ని క్షేమంగా వదిలిపెట్టాలంటే 1200 డాలర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. లేదంటే అబ్దుల్‌ కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించినట్లు వెల్లడించారు.

దీంతో తమ కుమారుడిని రక్షించాలని కోరుతూ అబ్దుల్‌ బంధువులు కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని లేఖలో కోరారు. అమెరికాలో ఉంటున్న అబ్దుల్‌ బంధువులు మార్చి 8వ తేదీన క్లీవ్‌లాండ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు పెట్టారు. అబ్దుల్‌ చివరిసారి 8న క్లీవ్‌లాండ్‌లోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కనిపించినట్లు సీసీ కెమెరాల ఆధారంగా అక్కడి పోలీసులు తెలిపారు. రెండు వారాలు గడుస్తున్నా తమ కుమారుడి ఆచూకీ లభ్యంకాకపోవడంతో తండ్రి మహమ్మద్‌ సలీమ్‌ మరోమారు మార్చి 18న కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించారు. కేంద్రం జోక్యం చేసుకుని కొడుకు క్షేమంగా తిరిగి వచ్చేలా చూడాలని కోరారు. అటు చికాగోలోని భారత కాన్సులేట్‌కు విజ్ఞప్తి చేశారు. క్లీవ్‌ల్యాండ్ పోలీసులు ప్రస్తుతం అబ్దుల్ అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై అబ్దుల్‌ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.