Telangana: హమ్మయ్య.. ఎండాకాలం నగరంలో తాగునీటికి ఇబ్బంది లేదు!

| Edited By: Jyothi Gadda

Feb 20, 2024 | 8:06 PM

ఈ వేసవిలోనే రంజాన్ మాసం ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట్ల మసీదులకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. మసీదు ప్రాంతాల్లో సీవరేజీ ఓవర్ ఫ్లో లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దీనికోసం డివిజన్ కొక మినీ జెట్టింగ్ మిషన్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. మ్యాన్ హోల్ పనుల అనంతరం సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.

Telangana: హమ్మయ్య.. ఎండాకాలం నగరంలో తాగునీటికి ఇబ్బంది లేదు!
Drinking Water
Follow us on

హైదరాబాద్ నగరంతోపాటు ఓఆర్ఆర్ పరిధి వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. అవసరం మేరకు తగినంత నీరు అందుబాటులో ఉందని ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, ఎస్టీపీలపై జలమండలి ట్రాన్స్ మిషన్, రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంతోపాటు ఓఆర్ఆర్ లోపలి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు ఎండి తెలిపారు. జలమండలి ప్రస్తుతం రోజూ 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుందని.. అదనంగా మరో 15 నుంచి 20 ఎంజీడీల నీరు అవసరముందని అంచనా వేశారు.. ఆ మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.

సీజీఎం నుంచి మేనేజర్ స్థాయి వరకు.. క్షేత్రస్థాయిలో అధికారులు సొంతంగా ప్రణాళికలు వేసుకుని ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. తాగునీటి సరఫరా, కలుషిత నీరు సమస్యలపై వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ట్యాంకర్లు, అదనపు నీటి కోసం వచ్చే వినతులను పరిగణలోకి తీసుకుని సత్వరమే వాటికి స్పందించి.. వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. నీటి సరఫరా, ట్యాంకర్ల రవాణాపై విజిలెన్స్ అధికారులు డ్రైవ్ చేపట్టాలని సూచించారు. నగరంలో భూగర్భంలో నీటి మట్టాల స్థాయిపై నివేదిక తయారు చేసి అందించాలని ఎండీ ఆదేశించారు.

జలమండలి పరిధిలో ఉన్న బోర్ వెల్స్ పనితీరును పరిశీలించి అవసరమైన చోట యాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టం (ఏఎంఎస్) కింద మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగర వ్యాప్తంగా ప్రస్తుతం 70 మంచినీటి ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. అవసరమైతే అదనపు స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు పొందాలని సూచించారు. అంతేకాకుండా అవసరం మేరకు ట్యాంకర్లు, ట్రిప్పుల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో డిమాండును బట్టి నీటి సరఫరా సమయాన్ని పెంచాలన్నారు. ఫిల్లింగ్ స్టేషన్లలో కరెంటు కోతలు, మోటారు రిపేర్లు, తదితర సమస్యలు తలెత్తినప్పడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఇప్పటికే అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. అన్ని స్టేషన్ల కెమరాలు ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉన్నట్లు వివరించారు. నిరంతరం వాటి ద్వారా అక్కడి పరిస్థిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎంసీసీ, ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో రహదారులపై మురుగునీరు పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. కలుషిత నీరు సరఫరా కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. అలాగే కలుషిత జలాల సరఫరా కావటం వల్ల నీరు వృథాగా పోతున్న ప్రాంతాలను గుర్తించి, సమస్యను పరిష్కరించడానికి తగిన నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వాటర్ లీకేజీలు, సీవరేజి ఓవర్ ఫ్లో లను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలన్నారు. అలాగే మ్యాన్ హోళ్ల నుంచి తీసిన సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ఎక్కడైనా మ్యాన్ హోళ్లు ధ్వంసమైతే వెంటనే పునర్మిర్మాణం చేపట్టాలని, మ్యాన్ హోళ్ల కవర్లు కనిపించని స్థితిలో ఉన్నా.. వెంటనే కొత్త మూతలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా సమయాల్లో కొంత మంది నల్లాకు మోటార్లతో నీటిని తోడుతున్నట్లు బోర్డు దృష్టికి వచ్చినట్లు తెలిపారు. దీనివల్ల లో-ప్రెజర్ సమస్య తలెత్తి.. మిగతా ప్రజలకు ఇబ్బందులు వస్తున్నట్లు వివరించారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కు ఆదేశించారు.

రంజాన్ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు:

ఈ వేసవిలోనే రంజాన్ మాసం ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట్ల మసీదులకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. మసీదు ప్రాంతాల్లో సీవరేజీ ఓవర్ ఫ్లో లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దీనికోసం డివిజన్ కొక మినీ జెట్టింగ్ మిషన్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. మ్యాన్ హోల్ పనుల అనంతరం సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..