Hyderabad Rains: హైదరాబాద్ లో బీభత్సం సృష్టించిన భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తం

నారాయణ గూడ, పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లి వంటి అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Hyderabad Rains: హైదరాబాద్ లో బీభత్సం సృష్టించిన భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తం
Hyderabad Rains

Updated on: Jul 26, 2022 | 9:08 AM

Hyderabad Rains: భాగ్యనగరంలో అర్ధరాత్రి మరోసారి కుండపోత వర్షం(Heavy Rains) కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్ (Ameerpet), పంజాగుట్ట, బంజారాజిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్, దిల్ షుక్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, నారాయణ గూడ, పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లి వంటి అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లిలో భారీ వర్షానికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వరదలో జంతువులు చిక్కుకున్నాయి. కొన్ని జంతువులు  కొట్టుకుపోయాయి. రహదారులు నదులను తలపించాయి.

బేగం బజార్‌లో ఇళ్లు, షాపుల్లోకి చేరిన వర్షం నీరు చేరుకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సామాగ్రి, నిత్యావసర వస్తువులు నీట మునగిపోయాయి. దీంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టారు.

భారీ వర్షాలతో హైదరాబాద్ లోని జలాశయాలు నిండుకుండలా మారాయి. జంట జలాశయాలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. దీంతో అధికారులు 2,118 క్యూసెక్కుల నీటిని  మూసిలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్,  హిమాయత్ సాగర్‌ లో పూర్తి స్థాయిలో నీరు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమీప ప్రాంత ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..