AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ బీటెక్ విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఇది కదా కావాల్సింది

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో చదువుతున్న బీటెక్ విద్యార్ధులకు నిజంగానే పండుగ లాంటి వార్త అందించనుంది. ఫీజుల విషయంలో కీలక నిర్ణయం త్వరలోనే రానుంది. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి.

Telangana: తెలంగాణ బీటెక్ విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఇది కదా కావాల్సింది
Students
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Feb 12, 2026 | 8:03 PM

Share

తెలంగాణలో బీటెక్ చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. 2025 నుంచి 2028 వరకు అమలయ్యే ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. గతంలో టీఏఎఫ్‌ఆర్‌సీ సూచించిన భారీ పెంపును అమలు చేస్తే విద్యార్థులపై భారీ భారం పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఫీజుల నిర్ణయంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఫీజుల గడువు 2024-25తో ముగియడంతో, 2025-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమలులోకి రావాల్సి ఉంది. అయితే ఈ దశలో కొన్ని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలకు 60 నుంచి 70 శాతం వరకు ఫీజులు పెంచాలనే ప్రతిపాదనలు వచ్చాయి.

సీబీఐటీ వంటి కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న రూ.1.65 లక్షల ఫీజును రూ.2.23 లక్షలకు పెంచాలనే స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. ఈ పెంపు అమలైతే మధ్యతరగతి కుటుంబాలకు చదువు భారంగా మారుతుందన్న అభిప్రాయం బలపడింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో తెలంగాణ ప్రభుత్వం ఫీజుల అంశాన్ని మరోసారి సమగ్రంగా పునఃసమీక్షించినట్లు తెలుస్తోంది. కేవలం కాలేజీల నిర్వహణ ఖర్చుల ఆధారంగా కాకుండా.. వాటి విద్యా నాణ్యత, మౌలిక సదుపాయాలు, ప్లేస్‌మెంట్స్, పరిశోధనల స్థాయి, ఎన్ఏఏసీ గ్రేడింగ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వంటి అంశాలను కూడా కొత్త కొలమానాలుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విధానాన్ని కోర్టు ద్వారా కూడా స్పష్టం చేయడంతో.. ఫీజుల ఖరారులో పెంపు కంటే నాణ్యతనే ప్రధాన ప్రమాణంగా తీసుకున్నట్లు సమాచారం. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 150కి పైగా ఇంజినీరింగ్ కాలేజీల్లో మెజారిటీ కాలేజీలకు పాత ఫీజులే యథాతథంగా కొనసాగనున్నాయి. కొద్ది కాలేజీలకు మాత్రమే 10 నుంచి 15 శాతం మేర స్వల్ప పెంపు ఉండవచ్చని తెలుస్తోంది. అంతేకాదు.. అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణాలతో కొన్ని కాలేజీలకు గతంలో ఉన్న ఫీజు కంటే తక్కువగా ఖరారు చేసినట్లు సమాచారం.

ఈ ఫీజుల ఖరారుకు సంబంధించిన పూర్తి నివేదికను టీఏఎఫ్‌ఆర్‌సీ ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖకు సమర్పించింది. అక్కడి నుంచి ఈ ఫైల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలనకు వెళ్లింది. ఆయన తుది సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయగానే అధికారికంగా జీవో విడుదల కానుంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే.. రాబోయే మూడేళ్ల పాటు బీటెక్‌లో చేరే విద్యార్థులకు ఫీజుల భయం తగ్గి, చదువుపై దృష్టి పెట్టే అవకాశం పెరుగుతుందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.