Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కల్తీతో శాల్తీలు లేస్తాయ్ జాగ్రత్త…

ఏది ఒరిజనల్లో ఏది డూప్లికేటో? ఏది నికార్సో, ఏది చచ్చుపుచ్చు సరుకో. కారం, ఉప్పు, పప్పు, పసుపూ ఏది వాడాలన్నా భయమే. ఇక నూనెలయితే ఏ కొవ్వు కలిసిందో, వాటిల్లో ఏమేం కలిపారో అస్సలు కనిపెట్టలేం. చివరికి టేస్ట్‌కోసం వేసే మసాలాలు, గార్లిక్‌ జింజర్‌ పేస్టు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. ముచ్చటపడి ముక్కలాగిద్దామనుకుంటే నాన్‌వెజ్‌ నాణ్యత కూడా దారుణాతి దారుణం. ఈ కల్తీ ప్రపంచంలో ఏం కొనగలం? ఏది తినగలం?

Hyderabad: కల్తీతో శాల్తీలు లేస్తాయ్ జాగ్రత్త...
Food Adulteration
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 23, 2025 | 9:43 PM

మూసీ ఒడ్డున మురికి పేస్ట్‌.. కల్తీ నూనెకు బ్రాండెడ్‌ సీల్స్‌..  మటన్‌ జోలికెళ్లారో మటాషే! ఇలాగైతే ఇంకేం తింటాం. ఏ ఆకులో అలములో తిని బతికేద్దామంటే.. కాంక్రీట్‌ జంగిల్‌లో అవి కూడా దొరికే పరిస్థితి లేదు. సొమ్ముపోయి దిమ్ము పట్టినట్లవుతోంది కల్తీ ప్రపంచంలో సామాన్యుడి పరిస్థితి. కల్తీ ఆహారపదార్థాలు, డూప్లికేట్‌ సరుకులకు అడ్డాగా మారుతోంది గ్రేటర్‌ హైదరాబాద్‌.

మూసీ ఒడ్డున నడుస్తున్న మురికి వ్యవహారం గురించి మీకు చెప్పాలి. అల్లం, వెల్లుల్లి చచ్చులు పుచ్చులు తీసుకొచ్చి, అపరిశుభ్ర వాతావరణంలో చేతులతోనే పిసికేస్తే ఆ పేస్ట్‌నే మనం టేస్ట్‌కోసం వాడుతున్నాం. ఏదో ఒక లేబుల్‌ అంటించేసి ఆ ఛండాలాన్నే ప్యాకింగ్‌ చేసి అంటగడుతున్నారు వ్యాపారులు. అధికారులు పట్టుకున్నారు కాబట్టి పారబోశారు. ఎవరూ పట్టించుకోకపోతే అంతేసంగతులు. ఇలాంటి సంగతులు సిటీలోనే కాదు, సిటీ పొలిమేరల్లోనూ బోలెడన్ని. అందుకలదు ఇందులేదనే సందేహము వలదన్నట్లు ఎందెందు చూసినా కల్తీనే. ప్రజల ప్రాణాలకు హానికరమని తెలుసు. కానీ ఎవడెలా పోతేం మనకేంటి. అమ్మామా.. సొమ్ము చేసుకున్నామా చేతులు కడిగేసుకున్నామా అన్నట్లుంది కల్తీరాయుళ్ల దందా.

ఓల్డ్‌సిటీలోని చాదర్‌ఘాట్‌ వినాయక్‌నగర్ కాలనీలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కుటీర పరిశ్రమలా తయారు చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ముందురోజే ఓల్డ్‌సిటీలో టన్నుల కొద్దీ కుళ్లిన మటన్‌ని సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటుతో వాంతి వచ్చినంత పనవుతుంటే తట్టుకోలేక స్థానికులిచ్చిన సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును మూసీలో పారబోయించారు.

నార్త్‌ బ్యాచ్‌ దిగిపోయింది. జనం ఆరోగ్యాలను గుల్లచేయడమెలాగన్నదానిపై రీసెర్చ్‌ చేస్తోంది. చాదర్‌ఘాట్‌ అల్లం వెల్లుల్లి ఆ బ్యాచ్‌ పనే. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్లిన మాంసం కూడా వచ్చిపడుతోంది. మంగళహాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మటన్‌షాప్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మాంసాన్ని పోలీసులు గుర్తించారు. ఏకంగా నాలుగు నెలలనుంచి నిల్వచేసిన 12 క్వింటాళ్ల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. హోటళ్లకు, పెళ్లిళ్లలాంటి శుభకార్యాలకు ఇలాంటి మాంసాన్ని హోల్‌సేల్‌లో అంటగట్టేస్తున్నారు. దుర్వాసన రాకుండా వెనిగర్ కలుపుతున్నారు.

హోల్ సేల్ మార్కెట్ నుంచి చెడిపోయిన గొర్రె, మేక మాంసంతో పాటు నాసిరకం సరుకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి హోటళ్లకు, ఫంక్షన్లకు సరఫరా చేసే ఓ కేంద్రంపై అధికారులు దాడులు జరిపారు. చార్మినార్ జోన్ వెటర్నరీ అధికారులతో కలిసి.. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. రెండు క్వింటాళ్ల చెడిపోయిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌ కేంద్రంగా నకిలీ, కల్తీ నూనెల దందా ఈమధ్యే బయటపడింది. మలక్ పేట గంజ్ లో పేరున్న కంపెనీల డిస్ట్రిబ్యూటర్ల పేరుతో జరుగుతున్న అక్రమాల గుట్టురట్టయింది. డ్రమ్ముల్లోని నూనెని వేరే నూనెలతో కలిపి 20 లీటర్ల క్యాన్లలో నింపేస్తున్నారు. వాటినే పేరున్న కంపెనీల బ్రాండ్ల సీల్స్‌తో అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పేరున్న కంపెనీల కార్టన్లు, కంపెనీల లేబుళ్లను గుర్తించారు. భారీ మార్జిన్‌ మిగులుతోందని కొందరు వ్యాపారులు వీటిని ప్రోత్సహిస్తున్నారు.

పరుగుల ప్రపంచంలో వండుకోలేని, ఇంటిదగ్గర టైంకి తినలేని వారి వీక్‌నెస్‌ని క్యాష్‌ చేసుకుంటున్నాయి కొన్ని హోటళ్లు, టిఫిన్‌సెంటర్లు. హోటల్స్, కేఫ్స్‌లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదని గుర్తించారు. గచ్చిబౌలి వరలక్ష్మి టిఫిన్స్, మాదాపూర్ క్షత్రియ ఫుడ్స్, తుర్కయంజాల్ హోటల్ తులిప్ గ్రాండ్‌లో తనిఖీలు చేపట్టారు. కిచెన్ పరిసరాలు ఎలుకలు, బొద్దింకల సంచారంతో అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కుళ్లిన చికెన్‌, కాలంచెల్లిన సరుకులతో పాటు సింథటిక్ ఫుడ్ కలర్స్ వండి వారుస్తున్నాయి కొన్ని హోటళ్లు.

కడుపు చించుకుంటే కాళ్లమీద పడేలా ఉందే తప్ప కల్తీలు, నకిలీలు మాత్రం ఆగడంలేదు. ఆ వస్తువూ ఈ వస్తువనే తేడా ఏం లేదు. డబ్బుపోసి రోగాలు కొనితెచ్చుకున్నట్లవుతోంది కస్టమర్ల పరిస్థితి. కఠినశిక్షల భయం ఉంటేతప్ప కల్తీరాయుళ్ల ఆటగట్టించడం అసాధ్యం.