
హైదరాబాద్లో అద్భుతం.. కేబుల్ బ్రిడ్జి. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రాగానే అహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ దొరికిందంటూ నగరవాసులు సంతోషించారు. అయితే.. దురదృష్టవశాత్తు కేబుల్ బ్రిడ్జి విషాదాలకు కేరాఫ్గా మారిపోయింది. అయితే ఆత్మహత్యలు లేదంటే ప్రమాదాలు.. అటు వైపు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కేబుల్ బ్రిడ్జిపై ఇప్పటిదాకా 40మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గం చెరువు అందాలను వీక్షిస్తూ.. చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తూనే క్షణాల్లో చెరువులోకి దూకి చాలామంది సూసైడ్ చేసుకున్నారు. లేటెస్ట్గా హిట్ అండ్ రన్ కేసు అందర్నీ షాక్కి గురిచేసింది.
నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే దుర్గం చెరువు బ్రిడ్జిపై నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కొందరు సందర్శకులు నిర్దేశించిన ఫుట్ పాత్ పై కాకుండా.. వంతెనపై వాహనాలు వెళ్లే రహదారికి ఇరువైపులా ఫోటోలు దిగేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల రాత్రి సమయంలో సెల్ఫీ దిగుతున్న ఇద్దరు యువకులను ఓ కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ప్రమాదానికి గురైన ఇద్దరు వ్యక్తులు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు.
శుక్రవారం రాత్రి 12.30 సమయంలో కేబుల్ బ్రిడ్జి చూసేందుకు వెళ్లారు. తమ బైక్ ను వంతెనపైనే ఓ పక్కన నిలిపి.. రోడ్డుపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇంతలో ఇనార్బిట్ మాల్ వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ కుమార్ను కారు కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పారిపోయాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు.
ప్రమాద స్థలంలో దొరికిన వాహనం నంబర్ ప్లేట్ను పరిశీలించిన పోలీసులు కారు యజమాని కోసం గాలించారు. ఫైనల్గా బంజారాహిల్స్లోని ఇబ్రహీంనగర్కు చెందిన వెంకట్ రెడ్డి అని గుర్తించారు. వరుస ఘటనలతో పోలీసులు అలర్టయ్యారు. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం వస్తే ఫైన్లు వేస్తామని, అలానే కేసులు కూడా నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…