
ఎక్కడ చూసినా అదే మాట అందరి నోటా అదే పాట రామ మందిర నిర్మాణం.. ఈనెల 22వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరంలో రాముని ప్రతిష్ట జరుగుతుంది. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు అయోధ్య వైపే చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాముని కోసం కానుకలు సిద్ధమై అయోధ్యకు తరలి వెళ్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుండి రామమందిర నిర్మాణంలో కీలకమైన తలుపులు, రాముని పాదుకలు సిద్ధమై ఇక్కడ నుండి వెళ్ళాయి. ఇక రాముని దర్శనం మాత్రమే మిగిలి ఉంది. అందరి నడక అయోధ్య వైపే వెళ్తున్నాయి. ఇంతటి మహాత్భాగ్యం పొందలేని వారికోసం కదిలే రామ మందిరం నిర్మాణాన్ని సిద్ధం అయింది. ఎక్కడో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
పరిస్థితులను బట్టి వివిధ రకాల కార్లను తయారు చేసే హైదరాబాద్కు చెందిన సుధాకర్. రామ మందిరం నిర్మాణం మాట పెద్ద ఎత్తున ఇప్పుడు వినిపిస్తుండడంతో మొబైల్ రామ మందిరం నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఓల్డ్ సిటీకి చెందిన 20 మంది మెకానిక్లు, కొంతమంది నిపుణుల సహాయంతో కార్పైన అచ్చం రామమందిర నిర్మాణాన్ని మరోసారి నిర్మించారు. రెండు సంవత్సరాలుగా శ్రమించి ఈ నిర్మాణాన్ని సిద్ధం చేశారు. మెటా డోర్ వాహనంపై దాదాపు 216 ఫైబర్ స్తంభాలతో కారుపైన మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు. 307 ఫ్రీక్వెన్సీ ఫోర్స్తో కూడిన ఇంజిన్ ఉంది. ఏడు అడుగుల ఎత్తుతో శిఖరం సిద్దం అయింది.
అయోధ్యకు వెళ్లి రాముడి దర్శనం చేసుకోవాలని అందరికీ ఉన్నా.. అక్కడికి వెళ్లలేని వారి కోసం ఈ నిర్మాణాన్ని చేపట్టానని సుధాకర్ అంటున్నారు. ఈ నిర్మాణం కోసం పని చేసిన 20 మందిలో సగం మంది ముస్లిం సోదరులేనని.. చాలా ఇంట్రెస్ట్గా వర్క్ పూర్తి చేశారని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రదర్శనకు ఉంచిన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో కదిలే రామ మందిరం నిర్మాణాన్ని తిప్పుతూ అందరికీ అయోధ్యని కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తానని టీవీ9తో తెలిపారు. ఆ తర్వాత అవకాశం ఉంటే తప్పకుండా అయోధ్య గారికి తీసుకెళ్తానని అంటున్నారు.