
ట్రాన్స్పోర్ట్ కష్టంగా మారింది. పోలీసులు రైళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. దీంతో వారి దందా సాగడం లేదు. అక్కడి నుంచి.. ఇక్కడి తేవడం రిస్క్ ఎందుకు అనుకున్నారు. టెర్రస్పైనే తమ ప్లాన్ అమలు చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ మలక్పేట్ మహబూబ్ మిషన్ మార్కెట్లోని ఒక భవనంలోని టెర్రస్లో గంజాయి మొక్కలు పెంచుతున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం (డిసెంబర్ 5) హైదరాబాద్ నగర ఎన్ఫోర్స్మెంట్ టీం అదుపులోకి తీసుకున్నారు.
మలక్పేట్ మహబూబ్ మిషన్ మార్కెట్లో భవనంలో కింద షాపులు ఉండగా, పైభాగం టెర్రస్లో బీహార్కు చెందిన లవకుశ్, బీమ్లేష్ అనే ఇద్దరు వ్యక్తులు గత ఆరు నెలలుగా గంజాయి సాగు చేస్తున్నారు. ఈ మొక్కలను వేపుగా పెంచి, తగిన సమయంలో దాన్ని గంజాయిగా మార్చి అమ్మకాలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సమాచారం అందడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్ఐ శ్రీనివాస్ నేతృత్వంలోని టీమ్ టెర్రస్పై దాడి చేసి సోదాలు నిర్వహించింది.
ఈ దాడిలో మూడు నుంచి ఆరు మీటర్ల ఎత్తులో పెరిగిన ఐదు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 55 గ్రాముల ఎండు గంజాయి, రెండు సెల్ఫోన్లను కూడా సీజ్ చేశారు. ఈ మొక్కల నుంచి సుమారు 10 కిలోల గంజాయి దిగుబడి రావచ్చని ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తెలిపారు. నిందితులను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. నగరంలోని వ్యాపార భవనాల్లో గంజాయి సాగు పెరుగుతుండటంపై అధికారులు ప్రజలకు జాగ్రత్త సూచనలు చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్కు ఎలాంటి సమాచారం ఉన్నా.. తమకు తెలియజేయాలని.. ఇన్ఫర్మేషన్ ఇచ్చివారి వివరాలు గోప్యంగా ఉంచుతామంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..