AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం.. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు

హైదరాబాద్ మియాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలోని తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి హఫీజ్‌పేట్‌కు చెందిన బాలయ్య గల్లంతయ్యారు. హైడ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం.. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు
Manholes In Hyderabad
SN Pasha
|

Updated on: Jul 29, 2026 | 6:14 AM

Share

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలయ్యగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నాలాలో గల్లంతైన బాలయ్య కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. వైశాలినగర్ అండర్‌పాస్ సమీపంలో నాలా మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరమ్మతుల పనుల కోసం మ్యాన్‌హోల్‌ను తెరిచి ఉంచినప్పటికీ, అక్కడ తగిన భద్రతా ఏర్పాట్లు, హెచ్చరిక బోర్డులు లేదా రక్షణ బ్యారికేడ్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో బాలయ్య ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడి వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై బాలయ్య కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, సంబంధిత అధికారుల బాధ్యతారాహిత్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని వారు మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరమ్మతుల పనుల కారణంగా గత కొన్ని రోజులుగా వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్‌ను అధికారులు మూసివేసినట్లు సమాచారం. అయినప్పటికీ, ప్రమాదకర ప్రాంతాలను పూర్తిగా భద్రపరచడంలో నిర్లక్ష్యం జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనతో స్థానిక ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గాంధీ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సహాయక బృందాలతో మాట్లాడి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాలయ్య ఆచూకీ కోసం నాలాలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, గల్లంతైన వ్యక్తిని సురక్షితంగా గుర్తించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. అధికారులు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us