అధికారినంటూ ఫోన్‌ చేస్తారు.. డిజిటల్ అరెస్ట్‌ అంటూ బెదిరిస్తారు.. భయపడ్డావో అంతే ఇక

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను మోసం చేస్తున్న ఓ హ్యాబిట్యువల్ సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తాను సైబర్ క్రైం పోలీస్ అధికారినని నటిస్తూ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో బెదిరింపులకు పాల్పడినట్లు డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. అంతేకాదు, డిజిటల్ ఆధారాలు లేకుండా చేసేందుకు బాధితులను మొబైల్ ఫోన్లను ఫ్యాక్టరీ రీసెట్ చేయించినట్టు విచారణలో కనుగొన్నారు. నిందితుడిపై పలు సెక్షల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అధికారినంటూ ఫోన్‌ చేస్తారు.. డిజిటల్ అరెస్ట్‌ అంటూ బెదిరిస్తారు.. భయపడ్డావో అంతే ఇక
Cybercrime Hyderabad

Edited By:

Updated on: Jan 30, 2026 | 9:08 PM

వరంగల్ జిల్లా పరకాల మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన జాల సాయి రామ్ రెడ్డి (27)ను అనే యువకుడు కరీనంగర్‌లో నివాసం ఉంటూ.. వృత్తిరీత్యా రాపిడో రైడర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఇతను ఫేక్ మహిళా ప్రొఫైల్స్ సృష్టించి, ముఖ్యంగా షేర్‌చాట్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో బాధితులతో పరిచయం పెంచుకునే వాడు. నమ్మకం ఏర్పడ్డాక వాళ్ల ఫోన్ నంబర్లు తీసుకుని, తాను సైబర్ క్రైం పోలీస్ అధికారినని నటిస్తూ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడేవాడు. ఇలా వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఇటీవల విద్యార్థినికి సైబర్ క్రైం పోలీస్ అధికారినని బెదిరించి, పలుమార్లు డిజిటల్ లావాదేవీల ద్వారా మొత్తం రూ.97,540 మేర మోసం చేశాడు.

బాధితుడు నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక బృందాలతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 44 సైబర్ ఫ్రాడ్ పిటిషన్లు ఉన్నట్లు తేలింది. వీటిలో పలు నమోదైన కేసులతో పాటు NCRP పోర్టల్‌లో అనేక ఫిర్యాదులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు అనేక సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలు, యూపీఐ స్కానర్లు ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మోసం చేసిన డబ్బును మళ్లించేందుకు స్థానిక దుకాణదారుల బ్యాంక్ ఖాతాలను తప్పుడు కారణాలతో వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.

భయం సృష్టించి, పోలీసులుగా నటిస్తూ మోసాలకు పాల్పడే ఈ నిందితుడు పునరావృత సైబర్ నేరగాడిగా పోలీసులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఫోన్ కాల్స్ ద్వారా గానీ, యూపీఐ లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా గానీ పోలీసులు ఎప్పుడూ డబ్బులు లేదా ఫైన్‌లు వసూలు చేయరని స్పష్టం చేశారు. చట్టంలో ‘డిజిటల్ అరెస్ట్’ అనే భావన లేదని, ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.