Hyderabad: పారిపోయినా వదల్లేదు.. కత్తులు, వేటకొడవల్లతో వెంటాడి మరి హత్య చేసిన దుండగులు!
హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తిపై కొందరు దుండగులు వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ప్రాణభయంతో బాధితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. హంతకులు అతడిని వెంటాడి మరీ దాడి చేసి హత్య చేసి చంపేశారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, వేటకొడవల్లో మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బండ్లగూడలోని సుప్రీమ్ వైన్స్ వద్దకు చేరుకున్న బాధితుడు.. వారి కంటపడకుండా వైన్స్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ హంతకులు అతడిని వదిలిపెట్టలేదు.. వైన్స్లోకి వెళ్లి మరి బాధితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో నిందితులు అక్కడి నుంచి కారులో పారిపోయారు. స్థానికుల సమాచారంతో నాగోల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. వైన్స్లో పరిస్థితిని పరిశీలించి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి .. అసలు మృతుడు ఎవరు? అతడిని టార్గెట్ చేసి హత్య చేసేందుకు కారణం ఏమిటి? పాత కక్షలే హత్యకు కారణమా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
వైన్స్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ వాహనంలో వచ్చారు? ఎంతమంది ఉన్నారు? హత్యకు ముందు బాధితుడిని ఎక్కడి నుంచి వెంటాడారు? హత్య అనంతరం ఏ మార్గంలో పరారయ్యారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
