Hyderabad: వాచ్మెన్ దారుణ హత్య.. సీసీ కెమెరాల్లో రికార్డైన భయానక దృశ్యాలు..!
హైదరాబాద్: రాజేంద్రనగర్లో వాచ్మన్గా పనిచేసే నేపాల్ వ్యక్తి నాగేందర్ దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా యాక్టివాపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాడి చేసి చంపారు. ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలు, నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

హైదరాబాద్ మహానగర పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్కు చెందిన నాగేందర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వాచ్మన్గా పనిచేస్తున్న నాగేందర్ అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం (ఆగస్టు 24) అర్థరాత్రి నాగేందర్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనుక నుంచి యాక్టివా వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. నాగేందర్ను అడ్డగించిన ఇద్దరూ అతడిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టడంతో నాగేందర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
మరోవైపు, ఉదయం నాగేందర్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్థానికుల సహాయంతో పరిసర ప్రాంతాల్లో వెతకగా.. రోడ్డుపై నాగేందర్ మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. నాగేందర్పై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు గుర్తించారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు హార్డ్డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
