Hyderabad: ఘాట్కేసర్లో ఫ్యామిలీని భయపెట్టిన దుండగుల అరెస్ట్.. అసలు గొడవ ఏంటంటే?
హారన్ కొడుతూ ఓ కారులో ప్రయాణిస్తున్న ఫ్యామిలీని వెంబడిస్తూ భయబ్రాంతులకు గురిచేసిన కేటుగాళ్లను ఘట్కేసర్ పోలీసుల ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. రంగా శివ, అఖిత్ అనే ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘట్కేసర్లో రాత్రిపూట కారును వెంబడిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో తెలంగాణ పోలీసుల పనితీరుపై విమర్శలకు కూడా కారణమైంది. అయితే కేసును సీరియస్గా తీసుకున్న ఘట్కేసర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేసిన ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
అనంతరం వివాదానికి గల కారణాలపై ఆరా తీశారు. పోలీసుల దర్యాప్తులో, కారు హారన్ కొట్టడాన్ని అవమానంగా భావించిన ఇద్దరు యువకులు ఆగ్రహంతో కారును వెంబడించారని.. కొంతదూరం ఛేజ్ చేసిన అనంతరం కారును అడ్డగించి కొడుతూ అందులోని ప్రయాణికులను బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారిందని.. వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా సంఘటన జరిగిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ప్రత్యక్ష సాక్షుల వివరాలను సేకరించి నిందితుల కోసం గాలింపు చేపట్టామని.. ఈ క్రమంలోనే నిందితులు రంగా శివ, అరిగె అఖిల్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఘటన సమయంలో ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తూ రోడ్లపై రౌడీయిజానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇక నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఘటనలో ఉపయోగించిన పల్సర్ NS160 బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచారు.
అయితే ఈ ఘటన నేపథ్యంలో జనాలకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపై రౌడీయిజాన్ని సహించేది లేదని.. రోడ్లపై ఇలాంటి రౌడీయిజం, బెదిరింపులు, ప్రమాదకర డ్రైవింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
