
హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దక్షిణం ఒడిస్సా ఉత్తరాంధ్ర సమీపంలో సముద్రమట్టం నుండి 4.5 కి.మీ ఎత్తు వరకు చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు ఉపరితల చక్రవాత ఆవర్తనం అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఈ రోజు (సెప్టెంబర్ 12) తెలంగాణ లోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇక రేపు కూడా నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరన కేంద్రం హెచ్చరించింది. రాగల నాలుగు రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తాలో భారీగా చేరిన వరదనీరు చిన్నపాటి కుంటలను తలపించింది. వరద నీటిలో వాహనదారులు రహదారిపై వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం లేక తీవ్ర ఎండలతో ఉక్కపోతకు గురైన పట్టణ ప్రజలకు భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం లభించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.