
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం రోజున రెండు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో ఏకంగా 45.7 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా.. కొమురంభీం జిల్లా జంబుగలో 45.4 డిగ్రీలు రికార్డైంది. అలాగే రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం నల్లగొండ జిల్లాలతోపాటు ఉత్తర తెలంగాణల్లోని మరో మూడు నాలుగు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ దాని చుట్టు పక్కల జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా సోమవారం నాటి ఆవర్తనం మంగళవారం దక్షిణ చత్తీస్గడ్ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ.. సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా ఉంది. ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల వద్ద కొనసాగుతూ ఉంది. అలాగా మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..