
అగ్ని సాక్షిగా ఒక్కటైన భార్యాభర్తలు ఒకరినొకరినీ చంపుకుంటున్న రోజులివి.. కానీ కలకాలం తోడునీడగా ఉంటామని పెళ్లి మండపంలో ఏడడుగులు సాక్షిగా ఒక్కటయ్యూరు. అరవై ఐదు ఏళ్ల పాటు కష్ట సుఖాలను పంచుకున్నారు. అనారోగ్యంతో భార్య మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేక గంటల వ్యవధిలో భర్త కూడా ప్రాణాలు వదిలాడు. పెళ్లితో ఒక్కటైన ఆ దంపతులు.. మరణంలోనూ తమ బంధాన్ని వీడలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలానికి చెందిన బుడిగె లచ్చయ్య(90), వెంకటమ్మ(80)లకు 65 ఏళ్ల క్రితం వివాహమైంది. ఉన్న కొద్దిపాటి భూమిలో వవసాయం చేసుకుంటూ లచ్చయ్య గీత కార్మికుడుగా, వెంకటమ్మ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరూ కొడుకులు.. పెళ్లిళ్లు కూడా అయ్యాయి. పదేళ్ల క్రితం చిన్న కొడుకు అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో పెద్ద కొడుకు వద్దే ఉంటున్నారు. ఈ దంపతులు కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ క్రమంలో భార్య వెంకటమ్మ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో అదేరోజు సాయంత్రం వెంకటమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, 65 ఏళ్లుగా కష్టసుఖాలు పంచుకున్న భార్య వియోగాన్ని భరించలేక లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే లచ్చయ్య అంత్యక్రియలు కూడా కుటుంబ సభ్యులు, బంధువులు నిర్వహించారు.
ఇరువురి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరణంలోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారని కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు కన్నీరుమున్నీరయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..