Harish Rao: రేవంత్ వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్.. ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ కాదంటూ పంచులు!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మిషన్ భగీరథ, మంచినీరు, ప్రజారోగ్యం, కాళేశ్వరం లాంటి అంశాలపై వివరంగా స్పందిస్తూ రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘‘ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోరు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మిషన్ భగీరథ, మంచినీరు, ప్రజారోగ్యం, కాళేశ్వరం లాంటి అంశాలపై వివరంగా స్పందిస్తూ రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘‘ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోరు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారు. మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరం. ప్రజలకు నిరంతరం సురక్షితమైన మంచినీరు అందించాలనే గొప్ప ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చింది. దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా వంద శాతం ఇండ్లకు నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయడం సాధ్యమయింది. ఇది ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదు కాబట్టి, ఈ మిషన్ భగీరథ దండుగ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత శోచనీయం’’ అని హరీశ్ రావు అన్నారు.
‘‘మిషన్ భగీరథ కోసం మా ప్రభుత్వం రూ. 35 వేల కోట్లు ఖర్చు చేస్తే, దాన్ని రూ. 50 వేల కోట్లకు పెంచి చెబుతున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. మిషన్ భగీరథ ద్వారా ఏం లాభం తెచ్చారని, దానికి తెచ్చిన అప్పుకు వడ్డీ ఎలా కడుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన, భావ దారిద్ర్యమైన ఆరోపణ ఇంకోటి ఉండదు. అసలు మిషన్ భగీరథ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది? దాని లక్ష్యం ఏమిటి? అనే విషయాలపై కనీస అవగాహన కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సౌకర్యం కలిగిన జనావాసాల సంఖ్య కేవలం 5,672 అయితే, 2023 పూర్తయ్యే నాటికి 23,930 ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు అందుతున్నాయి. 2014కు ముందు కేవలం 30 శాతం ఇండ్లకు మాత్రమే నల్లాల ద్వారా మంచినీటి సౌకర్యం ఉండేది. అదిప్పుడు వంద శాతానికి చేరుకుంది’’ హరీశ్ రావు గుర్తు చేశారు.
‘‘ఇక మాట్లాడితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు కానీ, ఫలితం లేదని విమర్శిస్తున్నారు. ప్రాణహిత- చేవెళ్లను కాదని కాళేశ్వరం కట్టారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని మేము అసెంబ్లీలో చాలా స్పష్టంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా వివరించాం. అయినా అవే విమర్శలు చేయడం తగదు. 2007లో ప్రాణహిత- చేవెళ్లకు శంఖుస్థాపన చేసి, 2014 వరకు అంటే ఏడేళ్లు ఏ పనీ చేయకుండా ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చున్నారు అంటే సమాధానం ఉండదు. 2014తో పోలిస్తే 2023 చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో పెరిగిన ఆయకట్టును లెక్కలతో సహా చెబితే అది చెవికెక్కదు. 1956 నుండి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు మొత్తంగా 41 లక్షల కొత్త ఆయకట్టుకు మాత్రమే నీరు అందిస్తే, గడిచిన తొమ్మిదిన్నరెళ్ళలోనే మా ప్రభుత్వం 48 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిందని లెక్కలు, ఆధారాలతో సహా చెప్పినా వీరికి అవగాహన కలగదు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకమందే వేల కోట్ల అప్పులు ఎందుకు తెచ్చారు. ఇంకా మాపై విమర్శలు చేసి కాలక్షేపం చేయాలంటే కుదరదు. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. ప్రభుత్వం మొన్ననే ఏర్పడింది కదా అని ప్రజలు ఊరుకుంటున్నారు. మీరు ఇచ్చిన హామీలే మీకు ఉరితాళ్లుగా మారబోతున్నాయి. ముందు ఆ హామీల గురించి మాట్లాడండి’’ అని మాజీ మంత్రి మండిపడ్డారు.




