Hyderabad: వాహనదారులకు అదిరిపోయే గుడ్న్యూస్.. HYD-VJA హైవే విస్తరణపై కీలక అప్డేట్!
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.ప్రాంతీయ రింగ్ రోడ్డుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ను కూడా మంత్రి కోమటిరెడ్డి కోరారు.

తెలుగురాష్ట్రాలకు కీలకంగా ఉన్న హైదరాబాద్-విజయవాడ రహదారి, ఎల్బినగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు పుంజుకున్నాయి. తాజాగా హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో NHAI ఛైర్మన్ సంతోష్కుమార్ యాదవ్తో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలకంగా ఉన్న హైదారాబాద్- విజయవాడ విస్తరణ అంశాన్ని మంత్రి NHAI దృష్టికి తీసుకెళ్లారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని.. వాటిని నివారించేందుకు ఈ రహదారిని 8 లైన్లు విస్తరించాలని.. ఆ పనులను వీలైనంత త్వరగా చేపట్టాని మంత్రి కోమటి రెడ్డి కోరారు.
అలాగే హైదరాబాద్ శివారులో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఎల్బినగర్ నుండి హయత్ నగర్ వరకు, నాగపూర్ నమూనాలో 7.1 కిలోమీటర్ల మేర ‘డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్’ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన DPRను కూడా ఇప్పటికే కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు విషయంలో నిర్ణయం తీసుకొని అనుమతులు ఇవ్వాలని, అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు.
మరోవైపు ఆదివారం పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభ వేధికగా రాష్ట్రంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు పనులను మొదలు పెట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ RRR ప్రాజెక్టుకు మూడేళ్ల కిందటే ఆమొదం లభించిందని.. ప్రస్తుతం భూసేకరణ జరుగుతుంది.. ఈ ప్రక్రియ కూడా ముగింపు దశకు చేరుకుందని ఆయన తెలిపారు. రాష్ట్ర కేబినెట్ నుంచి ఆమోదం లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెడతామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
