వినాయకుడి బొజ్జలో సైబర్ సీక్రెట్..! గణపయ్య రూపంలో పోలీసుల వినూత్న వార్నింగ్..!
గణేష్ నవరాత్రులు వచ్చాయంటే సందడి మామూలుగా ఉండదు.. మండపాలు, పూజలు, విరాళాల సేకరణతో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. అయితే ఇదే సందడిని సైబర్ కేటుగాళ్లు క్యాష్ చేసుకునే ప్రమాదం ఉంది. ఫేక్ విరాళాల నుంచి నకిలీ QR కోడ్ల వరకు.. పండగ వేళ జరిగే సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

గణేష్ నవరాత్రులు వచ్చాయంటే సందడి మామూలుగా ఉండదు.. మండపాలు, పూజలు, విరాళాల సేకరణతో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. అయితే ఇదే సందడిని సైబర్ కేటుగాళ్లు క్యాష్ చేసుకునే ప్రమాదం ఉంది. ఫేక్ విరాళాల నుంచి నకిలీ QR కోడ్ల వరకు.. పండగ వేళ జరిగే సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
పండగ వాతావరణాన్ని కూడా సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫేక్ గణేష్ కమిటీలు, నకిలీ విరాళాల సేకరణ, QR కోడ్ మోసాలు, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, నకిలీ వెబ్ లింకులు, ఫేక్ కస్టమర్ కేర్, OTP, UPI వంటి పలు రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా పోలీసులు వినాయకుడి రూపంతో సైబర్ పై అవగాహన కల్పిస్తోంది.
వినాయకుడంటే జ్ఞానానికి ప్రతీక.. అడ్డంకులను తొలగించే ఆరాధ్యదైవం.. అయితే ఇప్పుడు అదే వినాయకుడి రూపం సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తోంది పోలీసు శాఖ. వినాయకుడి రూపం పెద్ద చెవులతో ఏం చెబుతోంది? చిన్న కళ్లతో ఏం నేర్పుతోంది? అభయహస్తంతో ఎలాంటి హెచ్చరిక చేస్తోంది? మోదకం వెనుక దాగిన సైబర్ సీక్రెట్ ఏంటి? గణేష్ నవరాత్రుల సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీసులు విడుదల శాఖ చేసిన పోస్టర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు “వినాయకుడు మనకు నేర్పే పాఠాలు – సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి” అనే సందేశంతో ప్రత్యేక పోస్టర్ను జిల్లా ఎస్పీ నరసింహ ఆవిష్కరించారు.
వినాయకుడి రూపంలో.. సైబర్ సేఫ్టీ..
వినాయకుడి రూపంలోని ఒక్కో అంశాన్ని.. ఒక్కో సైబర్ జాగ్రత్తకు అన్వయిస్తూ రూపొందించిన ఈ ప్రచారం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. వినాయకుడి రూపం మనకు అందిస్తున్న విజ్ఞానంపై పోలీసులు ప్రజలను చైతన్య వంతులను చేస్తోంది.
పెద్ద చెవులు.. ఏం చెబుతున్నాయంటే..?
వినాయకుడి పెద్ద చెవులు..! జాగ్రత్తగా వినమంటున్నాయి. ఫోన్లో ఎవరైనా మాట్లాడినా.. మెసేజ్ వచ్చినా.. గుడ్డిగా నమ్మొద్దు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లను జాగ్రత్తగా వినాలి.. చదవాలి అనే విషయాలను సూచిస్తోంది.
చిన్న కళ్ళు.. కానీ, పరిశీలన పెద్దది..!
వినాయకుడి చిన్న కళ్ళు.. ప్రతిదీ పరిశీలించమంటున్నాయి. ఆన్లైన్లో కనిపించిన ప్రతి విషయం నిజం కాదు. ఫేక్ ఆఫర్లు.. నకిలీ లింకులు.. మోసపూరిత మెసేజ్లు.. ఏదైనా సరే వెంటనే నమ్మకుండా ముందుగా పరిశీలించాలి.
అభయహస్తం.. క్లిక్ చేసే ముందు ఆలోచించండి..!
వినాయకుడి అభయహస్తం.. అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండమంటోంది.. తెలియని వ్యక్తులు పంపిన లింకులు, యాప్లు, QR కోడ్లు క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
మూషిక వాహనం.. మొబైల్ వాడకం కూడా జాగ్రత్తగానే..!
మొబైల్.. ఇంటర్నెట్ మన జీవితంలో భాగమైపోయాయి. కానీ వాటిని బాధ్యతా యుతంగా, అప్రమత్తంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు.
మోదకం.. ఇందులోనూ ఓ సీక్రెట్ ఉంది..!
వినాయకుడి మోదకం.. OTP, PIN, పాస్వర్డ్లను దాచుకోమంటోంది. PIN, OTP, పాస్వర్డ్లు, బ్యాంక్ ఖాతా వివరాలు.. ఎవరికీ చెప్పకూడదు. బ్యాంకు సిబ్బంది పేరుతో ఎవరైనా అడిగినా రహస్య సమాచారాన్ని వెల్లడించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కలంతో సందేశం.. లావాదేవీలపై నిఘా..!
వినాయకుడి మోదకం.. OTP, PIN, పాస్వర్డ్లను దాచుకోమంటోంది.. ముఖ్యమైన ఆన్లైన్ లావాదేవీల వివరాలను నమోదు చేసుకోవాలని.. అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే స్పందించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే.. మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి గణపయ్య చెబుతున్న పాఠం ఒక్కటే.. భక్తితో వినాయకుడిని కొలవండి.. విజ్ఞానంతో సైబర్ ప్రపంచంలో అడుగేయండి.. ఎందుకంటే సైబర్ మోసగాడికి మన నిర్లక్ష్యమే ఆయుధం.. మన అప్రమత్తతే అసలైన రక్షణ కవచం అంటోంది పోలీసు శాఖ.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
