మద్యం మత్తు మనిషిని చిత్తు చేస్తుంది. ఆ మత్తుకు బానిసలైన వాళ్లు.. అది దొరకకపోతే ఎంతకైనా తెగిస్తారు. అలాంటి ఓ ముఠా చేసిన వ్యవహారమే ఇది. ఓ నలుగురు పాత నేరస్తుల ముఠా వైన్ షాపులను టార్గెట్ చేస్తూ మద్యం ఇవ్వకపోతే చంపేస్తామంటూ కత్తులు, తల్వార్లతో బెదిరింపులకు దిగుతోంది. సోమవారం కూడా అదే పద్దతిలో ఓ వైన్ షాప్ వద్దకు వెళ్లి తల్వార్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు ముఠా సభ్యుడు. అప్రమత్తమైన మద్యం షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కత్తులు, తల్వార్లతో మద్యం వ్యాపారులను బెదిరింపులకు పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు. నిందితుల వద్ద రెండు తల్వార్లు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు షేక్ నౌషాద్(తిర్పల్లి), లాలు అలియాస్ అతీఫ్ ఉద్దీన్(పంజేషా), షేక్ ఇర్పాన్(మహా లక్ష్మీవాడ), అజ్మత్ ఖురేషి(చోటతలాబ్)లు పాత నేరస్థులుగా గుర్తించారు పోలీసులు. వీరిపై ఆదిలాబాద్లో గతంలో పలు కేసులు నమోదయ్యాయని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.
గత కొన్ని వారాలుగా ఆదిలాబాద్ జిల్లాలోని మద్యం దుకాణాల వద్దకు వెళ్లి చిల్డ్ బీర్లుకావాలంటూ.. డబ్బులు అడిగితే కత్తులు, తల్వార్లు చూపించి బెదిరింపులకు పాల్పడుతూ మద్యం లాక్కెళ్లేవారని.. జూన్ 6వ తేదీన రాత్రి ఆదిలాబాద్ జిల్లా తిర్పల్లిలోని శ్రీనివాస వైన్స్ వద్ద కూడా ఇదే తీరున వ్యవహరించారని.. షాపు సిబ్బందిని మద్యం ఇవ్వమంటూ చెప్పడంతో తల్వార్ తీసి బెదిరించాడని.. సిబ్బంది కేకలు వేయడంతో అక్కడి నుండి నిందితుడు పారిపోయాడని పోలీసులు తెలిపారు. ముఠాలో నలుగురు సభ్యులుండగా.. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు, పరారీలో ఉన్న అజ్మత్ ఖురేషి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్లో ఏముందో తెలిస్తే..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..