
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం లో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకునే వ్యక్తి ఆవేదనతో పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది..వినియోగదారుడు ఆకుకూర కట్ట తీసుకునే క్రమంలో ధర రూ. 5 కే ఇవ్వాలని అడగడంతో తీవ్ర ఆవేదన చెందిన రైతు గోడు వెల్లబోసుకున్నాడు. వ్యవసాయంలో అతను పడిన బాధలను వర్ణిస్తూ పాడిన పాట అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎంతైనా అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందంటున్నారు నెటిజన్లు..
ఏం బతుకిది రాయినై పుడితే బాగుండు అంటూ ఓ రైతు పాట రూపంలో వర్ణించాడు. తనతో పాటు సాటి అన్నదాతలు పడుతున్న కష్టాల
కన్నీటిని వివరిస్తున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దేశానికి అన్నం పెట్టి అన్నదాత బతుకు హీనంగా మారిందో, పది మంది కడుపునింపే రైతుల దుస్థితి ఎంత దుర్భరంగా మారిందో ..వేసిన పంటలు. ఎండుతుంటే వారి కడుపు ఎలా తరుక్కు పోతుందో కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాక, ప్రభుత్వాల నుంచి న్యాయం జరగక రైతులు పడే బాధేంటో వివరిస్తూ ..తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన ఆరెంపుల వెంకన్న పాడిన పాట అందరినీ ఆలోచింపజేస్తోంది.
వీడియో ఇక్కడ చూడండి..
చిన్నతనం నుంచే వ్యవసాయం చేస్తున్న వెంకన్న గ్రామంలో తనకున్న మూడెకరాల్లో వివిధరకాల పంటలు పండించి వాటిని మార్కెట్ కు తరలించి విక్రయించే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ వాపోయాడు. అధికంగా పెట్టుబడులు కావడం..ప్రకృతి సహకరించకపోవడంతో గిట్టుబాటు ధర రాక విసుగు చెందిన వెంకన్న కొంత భూమి కౌలుకు ఇచ్చి మరికొంత భూమిలో ఆకుకూరలు పండించి చుట్టుపక్కల ఊర్లలో అమ్ముతూ జీవిస్తున్నాడు. ఈక్రమంలో ఇటీవల పక్కనే ఉన్న దమ్మాయిగూడెం గ్రామానికి ఆకుకూరలు
అమ్మేందుకు వెళ్లిన వెంకన్న గోంగూర కట్ట రూ. 10 చెప్పగా ఓ వినియోగదారుడు రూ. 5లకు బేరం ఆడాడు. ఆ సమయంలో వెంకన్న బాధతో పాడినపాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.