Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ.. ఆ ఓట్లే కీలకం..

| Edited By: Srikar T

Jun 07, 2024 | 6:33 AM

శాసనమండలి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌, ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల పోరు ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడి కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, బిజెపి నుండి ప్రేమేందర్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 52 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ.. ఆ ఓట్లే కీలకం..
Mlc Elections
Follow us on

శాసనమండలి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌, ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల పోరు ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడి కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, బిజెపి నుండి ప్రేమేందర్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 52 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి గత నెల 27వ తేదీన పోలింగ్ జరిగింది. పట్టభద్రుల నియోజక వర్గంలో మొత్తం 4.63లక్షల ఓట్లు ఉండగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండలోని ఎఫ్‌సీఐ గోదాముల్లో ఐదో తేదీన కౌంటింగ్‌ కొనసాగుతోంది. రెండు రోజుల పాటు సాగిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు, బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇందులో 50శాతం +1 ఓటు అంటే 1,55,095 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ (గెలుపు కోటా) గా నిర్ణయించారు.

కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓటు..

మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థిలేవరూ గెలుపు కోటాను చేరుకోలేకపోయారు. దీంతో రెండవ ప్రాధాన్యమే కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకే‌ష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి మధ్య బలమైన పోటీ నడిచింది. ఎలిమినేట్‌ అయ్యే అభ్యర్థులకు వచ్చే ద్వితీయ ప్రాధాన్య ఓట్లే కీలకమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోటా 1,55,095 చేరుకోవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో 32,282 ఓట్లు రావాల్సివుంది. బీఆర్ఎస్ గెలవాలంటే రెండవ ప్రాధాన్యత ఓట్లలో 50,847 ఓట్లు రావాలి. ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.