
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీవీ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బస్ స్టాప్లో పడుకున్న గోవులను లేపేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధురాలు… వాటి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఇల్లందు ప్రాంతానికి చెందిన ఎల్లమ్మ, తన కుమారుడు శ్రీనివాస్ నివాసముంటున్న మణుగూరుకు వచ్చారు. తిరిగి ఉదయం తన స్వగ్రామానికి వెళ్లేందుకు ఆమె కాలనీలోని బస్ స్టాప్కు చేరుకున్నారు. ఆ సమయంలో బస్ స్టాప్ లోపల పశువులు పడుకుని ఉండటంతో, వాటిని అక్కడి నుండి లేపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న రెండు పశువులు ఒక్కసారిగా పరస్పరం పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఆవేశంతో ఉన్న పశువులు అదుపు తప్పి, ఎల్లమ్మపైకి దూసుకెళ్లి కొమ్ములతో బలంగా పొడిచాయి.
ఈ దాడిలో ఎల్లమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గాయాలు తీవ్రంగా ఉండటంతో మార్గమధ్యలోనే ఆమె మృతి చెందారు. ఈ ఘటనతో పీవీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్లమ్మ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రజా ప్రదేశాల్లో, ప్రధాన రహదారులపై పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నా, వాటిని నియంత్రించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..