
హైదరాబాద్లో సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాలుస్తుండగా, ఇప్పుడు వైద్యులే మోసగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 735 మంది వైద్యులు సైబర్ మోసాల బారిన పడి దాదాపు రూ.29.8 కోట్లను కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య వృత్తి నిపుణులకు ప్రత్యేక అవగాహన కల్పించే కార్యక్రమాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభించింది.
ఈ పెరుగుతున్న మోసాల నేపథ్యంలో వైద్య వృత్తి నిపుణులకు ప్రత్యేక అవగాహన కల్పించే కార్యక్రమాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభించింది. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో వైద్య రంగానికి చెందిన 72 మంది ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు అధిక విద్యావంతులు, వృత్తిపరంగా విజయవంతమైన వ్యక్తులను కూడా అత్యంత చాకచక్యంగా టార్గెట్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. చదువు, ఉద్యోగ హోదా లేదా సామాజిక స్థాయి ఎంత ఉన్నా సైబర్ మోసాల నుంచి ఎవరూ పూర్తిగా సురక్షితులు కాదని, అప్రమత్తత మరియు వెంటనే ఫిర్యాదు చేయడమే ప్రధాన రక్షణ మార్గాలని సూచించారు.
TGCSB గణాంకాల ప్రకారం వ్యాపార, పెట్టుబడి (బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్) మోసాల వల్ల అత్యధిక నష్టం జరిగింది. ఈ కేటగిరీలో 127 మంది వైద్యులు రూ.22.3 కోట్లను కోల్పోయారు. అలాగే డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన మోసాల్లో 22 మంది డాక్టర్లు రూ.2.2 కోట్లను కోల్పోయారు. గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ థెఫ్ట్) కేసుల్లో 144 మంది వైద్యులు సుమారు రూ.2 కోట్ల మేర నష్టపోయినట్లు వెల్లడైంది.
ఇక వ్యక్తిగత వివరాలు లేదా అధికారుల పేర్లు ఉపయోగించి మోసం చేసే ఇంపర్సనేషన్ స్కామ్లలో 181 మంది వైద్యులు రూ.1.3 కోట్లను కోల్పోగా, ఆన్లైన్ ప్రకటనల ద్వారా జరిగే మోసాల్లో 188 మంది డాక్టర్లు మరో రూ.1 కోట్ల మేర నష్టపోయారు.
వీటితో పాటు ఉద్యోగాలు, రుణాలు, బీమా, యూపీఐ లావాదేవీలు, మ్యాట్రిమోనీ, సెక్స్టోర్షన్, క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల పేరుతో కూడా వైద్యులను మోసం చేసిన ఘటనలు నమోదయ్యాయి.
సైబర్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు అనుమానాస్పాద లింకులు, ఫోన్ కాల్స్, పెట్టుబడి ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయడం లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. తెలంగాణలో వైద్యులను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న ఈ సైబర్ మోసాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..