Telangana: ఇసుక నుంచి ఏం బయటపడిందో తెలుసా..? ఆశ్చర్యపడిన జాలర్లు..
గోదావరి నది ఇసుకలో నుంచి వెలుగుచూసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పురాతన విగ్రహం ధర్మపురిలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దైవ మహిమగా భావిస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. .. ..

తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి సమీపంలోని గోదావరి నదిలో ఇసుక తవ్వకాల సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పురాతన విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే భక్తులు దీనిని దైవ మహిమగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
మొదట ఈ విగ్రహాన్ని గమనించిన జాలర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం గంగపుత్రులు అయిన వారు కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. నదిలో లభించిన ఈ విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రసిద్ధ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సమీపంలోనే మరో నరసింహ స్వామి విగ్రహం లభించడం విశేషంగా మారింది. ఈ విగ్రహానికి కూడా వేల సంవత్సరాల చరిత్ర ఉండొచ్చని పురావస్తు నిపుణులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ఘటనకు చారిత్రక ప్రాధాన్యత కూడా ఏర్పడింది.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఈ పురాతన విగ్రహం వెలుగుచూడటం మరింత విశిష్టంగా భావిస్తున్నారు. ప్రస్తుతం విగ్రహం గోదావరి నదిలోనే ఉంది. దానిని అక్కడే ఉంచాలా, లేక ఆలయానికి తరలించాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. వేద పండితులు, ఆలయ అధికారులు, సంబంధిత నిపుణుల సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ధర్మపురికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. గోదావరి ఇసుకలో నుంచి వెలుగులోకి వచ్చిన ఈ పురాతన విగ్రహం ప్రస్తుతం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
