Andhra News: కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి.. ఎందుకో తెలిస్తే..
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలనే తలకిందులు చేస్తాయనడానికి తాజాగా కడప జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటనే నిదర్శనం. ప్రేమ వ్యవహారం కారణంగా తన సొంత కూతురితో పాటు, తన తల్లిని కూడా ఓ వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

క్షణికావేశంలో ఓ వ్యక్తి తన సొంత కూతురితో పాటు తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కడప జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కడప నగరంలోని దండోరా కాలనీకి చెందిన బాబు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి హారిక అనే కుమార్తె ఉంది. ఆమె కడపలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అయితే హారిక ఒక అబ్బాయిని ప్రేమిస్తోందని తెలుసుకున్న బాబు, గత కొన్ని రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే వనిపెంటలో ఉంటున్న తన తల్లి ఓబులమ్మను ఇంటికి తీసుకొచ్చి కూతురు హారికకు కాపలాగా ఉంచాడు.
ఇటీవల పెన్షన్ కోసమని తల్లి ఓబులమ్మ తన సొంత గ్రామమైన వనిపెంటకు వెళ్లడంతో ఇంట్లో హారిక ఒక్కతే ఉంది. ఆ సమయంలో ఇంటికి వచ్చిన బాబు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై తన కూతురిని కొట్టి చంపాడు. అంతటితో ఆగకుండా, వనిపెంట గ్రామానికి వెళ్లి తన తల్లిని తీసుకువచ్చే క్రమంలో మార్గమధ్యలోనే ఆమెను కూడా గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, నిందితుడు బాబు తన తమ్ముడి భార్యను కూడా చంపే ప్రయత్నం చేయగా, ఆమె అక్కడ నుండి తప్పించుకుని పారిపోవడంతో ప్రాణాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు.
కడపలో జరిగిన ఈ జంట హత్యల ఉదంతం నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితుడు బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ హత్యలకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలినట్లు స్థానిక రిమ్స్ సీఐ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
