
తమ దత్తపుత్రుడి మూలాలను వెతుక్కుంటూ డెన్మార్క్కు చెందిన జంట భారతదేశంలోని అడవుల జిల్లాకు వచ్చింది. తమ బిడ్డ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ రాస్మూస్ దంపతులు శనివారం (జసవరి 31) ఆదిలాబాద్కు చేరుకున్నారు. 2016లో రెండు నెలల వయసు ఉన్న ఓ మగశిశువును రిమ్స్లో వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించి శిశు గృహానికి తరలించారు అధికారులు.
అయితే, శిశు గృహం నుండి 2016లో ప్రభుత్వ నిబంధనల పాటించి డెన్మార్క్కు చెందిన దంపతులు ఆ శిశువును దత్తత తీసుకున్నారు. అర్జున్ గా పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. అలా పదేళ్లు గడిచి పోయాయి. ఊహా తెలిసినప్పటి నుండి తన ఆనవాళ్ల కోసం ఆ దత్త తల్లిదండ్రులను ఆ పిల్లాడు పదే పదే ప్రశ్నిస్తూ వచ్చాడు. దీంతో ఆ బాలుడి కోరిక తీర్చేందుకు ఆ డెన్మార్క్ దంపతులు ఆ బాలుడి మూలాలు వెతుక్కుంటూ భారత్కు చేరుకున్నారు.
ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రిలో రెండు నెలల వయసున్న బాలుడిగా శిశు గృహం చేరుకున్నారని తెలుసుకుని అడవుల జిల్లాకు వచ్చారు. అడాప్టీ రైట్స్ కౌన్సిల్ సహకారంతో అర్జున్ మూలాల గురించి సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాలని రాస్మూస్ దంపతులు కోరుతున్నారు. అడాప్టీ రైట్స్ కౌన్సిల్ సంస్థ సభ్యులు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని తన తల్లిదండ్రుల సమాచారంపై బాలుడు ఎన్నోమార్లు ప్రశ్నలు అడుగుతుండడంతోనే జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. బాలుడి చేతి వేళ్ళు పెరగకపోవడంతో తల్లిదండ్రులు రిమ్స్ లో వదిలేసి వెళ్లినట్లు భావిస్తున్నామని, సంబంధీకులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం అందించాలని కోరారు. బాలుడిని దత్తత తీసుకున్న తల్లితండ్రులే పెంచుకుంటారని, తన ప్రశ్నలకు సమాధానం కోసమే ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..