
పెట్టుబడుల పేరిట సైబర్ నేరగాళ్లు మరోసారి భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ సారి వారి వలలో చిక్కింది మాజీ ఐపీఎస్ అధికారి భార్య. స్టాక్మార్కెట్ ట్రేడింగ్లో అదిరిపోయే ప్రాఫిట్స్ వస్తాయని నమ్మించి, దాదాపు రూ.2.58 కోట్లను సైబర్ మోసగాళ్లు కాజేశారు. బాధితురాలి భర్త గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారిగా తెలుస్తోంది. తొలుత స్టాక్మార్కెట్ పెట్టుబడులపై చిట్కాలు అందిస్తామంటూ సైబర్ నేరగాళ్లు వాట్సప్ ద్వారా మెసేజ్లు పంపారు. ట్రేడింగ్పై అవగాహన లేకపోవడంతో బాధితురాలు తన భర్త మొబైల్ నంబర్ను కూడా ఆ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేయించారు. అనంతరం 500 శాతం వరకు లాభాలు వస్తాయని ఆశ చూపించారు.
ఇది సెబీ సర్టిఫైడ్ వెబ్సైట్ అంటూ నమ్మించేందుకు నకిలీ సెబీ డాక్యూమెంట్స్ కూడా పంపించారు. వారి మాటలను నమ్మిన బాధితురాలు డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు వరుసగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. మొత్తం 19 లావాదేవీల ద్వారా రూ.2.58 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. కొంతకాలం తర్వాత పెట్టుబడులు నిలిపివేయడంతో, సైబర్ నేరగాళ్లు మళ్లీ డబ్బులు పెట్టాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. మరింత పెట్టుబడి పెట్టకుంటే ఇప్పటి వరకు పెట్టిన మొత్తం నష్టపోతుందని బెదిరించారు. ఈ దశలోనే మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పెట్టుబడుల పేరిట జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.