లోన్లీగా ఉన్న అమ్మాయిలే టార్గెట్.. సోషల్ మీడియాలో కొత్త స్కామ్.. సీసీ సజ్జనార్ కీలక హెచ్చరికలు!
ఈజీ మనీ కోసం అలావాటు పడిన కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు కొత్త కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. తాజాగా యూత్ను టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్లు.. రెంట్ బాయ్ఫ్రెండ్ ఆఫర్ల పేరుతో కొత్త రకం మోసానికి తెరలేపారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా తెలిపారు. ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు.

రాష్ట్రంలో అమ్మాయిలకు హైదరాబాద్ సీపీ సజ్చనార్ కీలక సూచనలు చేశారు. అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు అమ్మాయిలు మోసపోవద్దని తెలిపారు. అవి సౌబర్ నేరగాళ్లు విసురుతున్న వల అని.. వాటిని పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కి కాల్ చేయాలని సూచించారు.
ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు. అందులో ఇలా రాసుకొచ్చారు. ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!.. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉందని ఆయన అన్నారు. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇదని హెచ్చరించారు.
ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా 1st August Special – 50% OFF”, రెంట్ బాయ్ఫ్రెండ్ – యువర్ పర్సనల్ కంపానియన్ అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు ప్రదర్శిస్తూ.. ఒక గంట కాఫీ మీటింగ్కు రూ. 499, సినిమా డేట్కు రూ.1,249, షాపింగ్కు తోడుగా రావడానికి రూ.1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు రూ.1,999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి రూ. 4,499 అంటూ కేటుగాళ్లు ఒక పెద్ద ధరల పట్టికనే మీ ముందుకు తెచ్చారు. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు.
ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలుపెడతారని.. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి, ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారని హెచ్చరించారు.
ఆన్లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే.. వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉందని.. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించారు. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు బ్లాక్మెయిలింగ్కు పాల్పడే అవకాశం ఉందని సూచించారు.
ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టిసారించిందని.. వీటికి బాధ్యులైన వారిపై వేగవంతంగా దర్యాప్తు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? బయటకు వెళ్లినప్పుడు ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ నిఘా పెట్టాలని సూచించారు. స్మార్ట్ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు కేటుగాళ్ల వలలో పడే ప్రమాదం ఉందని తెలిపారు.
కేటుగాళ్లు ఇచ్చే ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోకండి. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ గానీ, కలవడం కానీ చేయవద్దు, ముందస్తుగా రూపాయి కూడా చెల్లించవద్దు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కి కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయండి.
I have officially assumed responsibilities as the Commissioner of Police, Hyderabad(@CPHydCity) today. We will continue to focus on maintaining peace and security across the city, striving to serve the community with effectiveness and integrity.@hydcitypolice @TelanganaDGP… pic.twitter.com/AWxqmJEPWL
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) September 30, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
