Telangana: పండుగ పూట విషాదం… విద్యుత్ షాక్‌కు దంపతులు మృతి.. 2 శునకాలు కూడా

| Edited By: Ram Naramaneni

Oct 12, 2024 | 5:00 PM

బండరాయిపాకుల గ్రామానికి చెందిన దుస్సు బక్కయ్య, నాగమ్మ భార్యాభర్తలు. ఇద్దరు శుక్రవారం గుడిపల్లి గుట్టకు సీతాఫలాల సేకరణకు వెళ్ళారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే బుడ్డ బాలయ్య పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లను గమనించలేదు.

Telangana: పండుగ పూట విషాదం... విద్యుత్ షాక్‌కు దంపతులు మృతి.. 2 శునకాలు కూడా
Electrocution
Follow us on

పండుగ పూట వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అడవి పందుల నుంచి పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ల షాక్ తగిలి దంపతులు మరణించారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని బండరాయిపాకుల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శానాయిపల్లి గ్రామానికి చెందిన ఎత్తపు చిన్న అగ్రయ్య భూమిని అదే గ్రామానికి చెందిన కురువకండే బుడ్డ బాలయ్య కౌలుకు తీసుకోవడం జరిగింది. కౌలు రైతు అడవి పందుల నుంచి పంట రక్షణకు కంటికి కనిపించనంత సన్నని వైర్లను పంటపొలాల చుట్టూ ఏర్పాటు చేసుకున్నాడు. సాయంత్రం పూట ఆ వైర్లకు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నాడు.

బండరాయిపాకుల గ్రామానికి చెందిన దుస్సు బక్కయ్య, నాగమ్మ భార్యాభర్తలు. ఇద్దరు శుక్రవారం గుడిపల్లి గుట్టకు సీతాఫలాల సేకరణకు వెళ్ళారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే బుడ్డ బాలయ్య పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లను గమనించలేదు. దీంతో ఆ సన్నని వైర్ల లో ప్రవహిస్తున్న విద్యుత్ షాక్ తగిలి భార్యభర్తలు ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే తెల్లవారుతున్న తల్లితండ్రులు ఇంటికి రాకపోవడంతో చిన్న కుమారుడు శ్రీరాములు వారి ఆచూకీ కోసం గాలించాడు. విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు గుర్తించి స్థానికులు… కుమారుడికి తెలియజేయడంతో కన్నీరుమున్నీరు అయ్యాడు. ఆ దంపతుల వెంట వెళ్ళిన రెండు శునకాలు సైతం షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి.

విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, మరోవైపు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో పొలాలకు ఇష్టానుసారంగా విద్యుత్ షాకులు పెడుతున్నారనీ వాదనలు వినిపిస్తున్నాయి. అకారణంగా పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేయరాదనే విషయాన్ని సంబంధిత అధికారులు హెచ్చరించకపోతే, అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన బాధితుల కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఘటన స్థలాన్ని చేరుకొన్న సిఐ నాగభూషన్ రావు.. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..