
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అలా తెరపడిందో లేదో కామారెడ్డి, కరీంనగర్లో ఇలా ఘర్షణకు తెరలేచింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు, బీజేపీ, బీఆర్ఎస్ వర్గాలు మరోవైపు ఆందోళనకు దిగారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానికేతరులు ఇతర నియోజకవర్గాల్లో ఉండకూడదు. కొండల్ రెడ్డి వెంటనే కామారెడ్డి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఐతే కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి తరపున తాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాను కాబట్టీ ఇక్కడ ఉండొచ్చన్నారు. ఓవైపు పోలీస్ బలగాలు మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా గుమికూడారు. పరస్పర వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాల వారిని నచ్చజెప్పి ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా చూశారు.
అటు కరీంనగర్ శివారు కొత్తపల్లి దగ్గర హైటెన్షన్ క్రియేటయింది. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు మధ్య వాగ్వాదాం జరిగింది. కార్యకర్తలు బండి సంజయ్కి సమాచారం ఇవ్వడంతో డబ్బులు పంచిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు బండి సంజయ్. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. ప్రలోభాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలు కావడంలో పోలీసులు విఫలమయ్యారని బండి సంజయ్ స్పందించారు. మైకుల మోతకు కళ్లెం పడిందని కాస్త ఊపిరిపీల్చుకున్నప్పటికీ.. ఇప్పుడంతా పోల్మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టారనే టాక్ పీక్స్కు వెళ్లింది. తాజాగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో మద్యం, నగదు ప్రలోభాలపై పోలీసులు నిఘాను మరింత పెంచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..