ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో గ్రూపుల పోరు కేసుల వరకు వెళ్లింది. రేవంత్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన చెరుకు సుధాకర్కి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఇటీవల చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్కి ఫోన్ చేసి సీరియస్ అయ్యారు కోమటిరెడ్డి. ఈ ఆడియో బాగా వైరల్ అయింది. ఈ వ్యవహారం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. కోమటిరెడ్డి వివరణ ఇచ్చినా సుధాకర్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. చంపుతానని బెదిరించిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై కేసు పెట్టారు సుధాకర్ తనయుడు సుహాస్. నల్గొండ వన్టౌన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఐపీసీ 506 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
తనను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం వల్లే తాను ఫోన్ చేసి మాట్లాడానని కోమటిరెడ్డి చెప్పిన తర్వాత కూడా సుధాకర్ ఫ్యామిలీ ఆయనపై కేసు పెట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
అయితే, పార్టీ పరంగానూ కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలను కలిసి కోమటిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వెంకట్రెడ్డికి వ్యతిరేక వర్గం అంతా సుధాకర్కు మద్దతుగా నిలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..