TS Politics: దళితబంధుపై చడీచప్పుడు లేదేంటి.. కేసీఆర్‌ ఈ పథకాన్ని కూడా అటకెక్కిస్తారేమో.. డీకే అరుణ విమర్శలు..

|

Nov 06, 2021 | 4:55 PM

కేసీఆర్ ధన అహంకారం, అధికార దురహంకారాన్ని హుజురాబాద్‌ ప్రజలు ఓటుతో తిప్పికొట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు

TS Politics: దళితబంధుపై చడీచప్పుడు లేదేంటి.. కేసీఆర్‌ ఈ పథకాన్ని కూడా అటకెక్కిస్తారేమో.. డీకే  అరుణ విమర్శలు..
Follow us on

కేసీఆర్ ధన అహంకారం, అధికార దురహంకారాన్ని హుజురాబాద్‌ ప్రజలు ఓటుతో తిప్పికొట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ఆయన ఓట్ల కోసం ప్రజలను అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై స్పందించిన ఆమె కేసీఆర్‌ బూటకపు మాటలను హుజురాబాద్‌ ప్రజలు విశ్వసించలేదన్నారు. ఉపఎన్నికలను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదని, ఎన్నికలు వస్తేనే సీఎంకు హామీలు గుర్తొస్తాయని మండిపడ్డారు. మళ్లీ ఎన్నికలు అయిపోగానే ముఖ్యమంత్రి అన్నీ మర్చిపోతారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ను విశ్వసించలేదు..
‘గతంలో ప్రకటించిన దళిత ముఖ్యమంత్రి హామీని అటకెక్కించాడు. ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు అన్నాడు. అదీ అమలు కాలేదు. పెన్షన్లు, గొర్రెల పంపిణీ రాష్ట్రంలో ఎక్కడా అమలు చేయకుండా కేవలం ఉప ఎన్నికల్లో లబ్ధి కోసం హుజురాబాద్‌లో మాత్రమే అమలు చేశాడు. ఆ తర్వాత దళిత బంధు తీసుకొచ్చారు. ఇప్పుడు అది కూడా గాలికి పోయినట్టే. ఎన్నికలయ్యాక మరుసటి రోజు నుంచే దళితబంధు అమలవుతుందని కేసీఆర్‌ చెప్పారు. ఇప్పుడు ఈ పథకం గురించి చడీ చప్పుడు చేయడం లేదు. ప్రభుత్వం ఏ ఊరిలో దళితబంధు ప్రారంభించిందో అక్కడే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. కేసియార్ మాటలను ప్రజలు విశ్వసించలేదనడానికి ఇదే నిదర్శనం. ఎన్నికల కోసం రూ. 100 కోట్లకు పైగా మద్యాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో ఏరులై పారించారు. రాష్ట్రంలో ఒక పక్క అప్పులు పెరిగాయి. ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వలేకపోతున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి గతంలో హరీశ్ రావు బీజేపీని నిందించారు. కానీ చమురు ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చడానికి మాత్రం ఆయన వ్యతిరేకించారు. కేంద్రం తన ఆదాయాన్ని కోల్పోతూ ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే, తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు వ్యాట్ తగ్గించలేదు. కేసీఆర్‌ హుజురాబాద్ తీర్పును మేల్కొలుపుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అరుణ వ్యాఖ్యానించారు.

Also Read:

Save Trees: హరిత హారం చెట్టు కొమ్మలు నరికినందుకు రూ.5వేల జరిమానా.. ఎక్కడంటే..

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సికింద్రాబాద్ – అగర్తలా మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లు

Premsagar Rao: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌. అదిష్టానానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు అల్టీమేటం..!