Rohith Vemula: రోహిత్‌ వేముల కేసు మరో మలుపు.. ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తేల్చిన పోలీసులు

రోహిత్‌ వేముల కేసు మరో మలుపు తిరిగింది. అతడి ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు తేల్చడంతో HCUలో ఆందోళనలు మొదలయ్యాయి. అటు రోహిత్‌ వేముల తల్లి కూడా ఈ కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఈ కేసును రీ ఓపెన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయించారు. దీంతో ఈ అంశం మరోసారి దుమారం రేపుతోంది.

Rohith Vemula: రోహిత్‌ వేముల కేసు మరో మలుపు.. ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తేల్చిన పోలీసులు
Rohith Vemula
Follow us

|

Updated on: May 04, 2024 | 10:29 AM

రోహిత్‌ వేముల కేసు మరో మలుపు తిరిగింది. అతడి ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు తేల్చడంతో HCUలో ఆందోళనలు మొదలయ్యాయి. అటు రోహిత్‌ వేముల తల్లి కూడా ఈ కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఈ కేసును రీ ఓపెన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయించారు. దీంతో ఈ అంశం మరోసారి దుమారం రేపుతోంది.

రోహిత్‌ వేముల ఆత్మహత్యకు అతడు తప్ప మరెవరూ కారణం కాదని, సాక్ష్యాధారాలు లభించలేదు గనుక కేసు మూసివేయడమైనది.. అంటూ ఎనిమిదేళ్ల న్యాయపోరాటానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు పోలీసులు. అప్పటి HCU వీసీ అప్పారావుకు ఈ కేసుతో సంబంధం లేదని తేల్చారు పోలీసులు. అంతేకాదు రోహిత్‌ వేముల ఎస్సీ కాదని పోలీసులు రిపోర్ట్‌ ఇచ్చారు. అయితే ఈ కేసును రీ ఓపెన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయించారు. అటు రోహిత్‌ వేముల తల్లి కూడా ఈ కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కోర్టు తేల్చడంతో HCUలో విద్యార్థులు కూడా ఆందోళనలు దిగుతున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

2016 జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్‌ వేముల ఆత్మహత్య ఘటన దేశం మొత్తాన్ని ఇటు వైపు చూసేలా చేసింది. దళితుల హక్కుల కోసం పోరాడుతున్నాడన్న కారణంతో అతడిపై వేధింపులకు పాల్పడి, ఆత్మహత్యకు ప్రేరేపించారు అనేది ఆరోపణ. ఎనిమిదేళ్లుగా సాగిన దర్యాప్తును ముగింపు దశకు తీసుకొచ్చి.. ఆధారాల్లేని కారణంగా కేసు మూసివేస్తున్నట్లు కోర్టుకు విన్నవించుకున్నారు సైబరాబాద్ పోలీసులు.

పీహెచ్‌డీ స్కాలర్‌గా తనకు రావల్సిన పాతికవేల స్టైపెండ్ ఆగిపోవడంతో మొదలైంది రోహిత్‌ వేముల వివాదం. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ పేరుతో వేదికను ఏర్పాటు చేసి.. దళిత విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న రోహిత్‌ను యుూనివర్సిటీ యాజమాన్యం వేధిస్తోందని స్నేహితులు ఆందోళన చేపట్టడం.. అదే సమయంలో ఏబీవీపీ లీడర్‌ సుశీల్‌కుమార్‌పై దాడి జరగడం వివాదం రేపింది. దీంతో యూనివర్సిటీ క్యాంపస్ కుల కొట్లాటలకు కేరాఫ్ అయ్యిందంటూ బండారు దత్తాత్రేయ హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీకి లేఖ రాశారు. ఆ వెంటనే రోహిత్‌తో పాటు మరో నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ తతంగం జరిగిన నెలరోజుల తర్వాత రోహిత్ వేముల బలవన్మరణం చెందడం..! అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులపై వివక్షకు రోహిత్ వేముల ఉదంతం ఒక తార్కాణం అంటూ నిరసన మొదలైంది. నేషనల్ మీడియాలోనూ, స్టూడెంట్స్ యూనియన్స్‌లోనూ పెద్దఎత్తున కదలిక వచ్చింది. హైదరాబాద్‌కి వచ్చి మరీ రోహిత్ వేముల కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌గాంధీ.. దీన్ని జాతీయ రాజకీయ అంశంగా మార్చేశారు. దళితుల ఓటుబ్యాంకును దృష్టిలో ఉంచుకుని.. స్మృతి ఇరానీ మంత్రిత్వశాఖను కూడా మార్చేసింది మోదీ సర్కార్.

ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఫిర్యాదుతో బీజేపీ నేతలపై, అప్పటి HCU వైస్ ఛాన్స్‌లర్ అప్పారావుపై కేసు నమోదు చేసి.. విచారణ ప్రారంభించారు పోలీసులు. కానీ.. గత ప్రభుత్వం కూడా వీళ్లకు ఈ కేసుతో సంబంధం లేదని తేల్చేసింది. 95 మంది సాక్షుల్ని విచారించి.. ఫోరెన్సిక్ రిపోర్ట్స్‌ని పరిశీలించి.. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నిర్ధారణకు వచ్చి.. రెండునెలల కిందటే క్లోజర్ రిపోర్ట్ రెడీ చేశారు పోలీసులు. మే 3న తెలంగాణ హైకోర్టుకు సమర్పించారు. సో.. కథ పరిసమాప్తం.

రోహిత్ వేముల ఎస్సీ కేటగిరీకి చెందినవాడు కాదని, తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ మనస్తాపం చెందాడని, అందువల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తేల్చారు పోలీసులు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారమే అప్పటి వీసీ రోహిత్‌పై చర్యలు తీసుకున్నారని, వేధింపులనేవి శుద్ధ అబద్ధమని రిపోర్టులో రాసిచ్చారు. కేసులో నిందితులైన మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు అనేకమంది ఏబీవీపీ నేతలకు సైతం ఇదొక పెద్ద రిలీఫ్.

అయితే ఈ కేసు మూసివేతను నిరసిస్తూ.. హెచ్‌సీయూలో ఆందోళనకు దిగారు విద్యార్థులు. దీంతో క్యాంపస్‌లో మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసుల వాదన పూర్తి అసంబద్ధం అంటోంది రోహిత్ కుటుంబం. 15 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ.. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌ని కలవనున్నాడు రోహిత్ సోదరుడు. మరోవైపు ఈ కేసును ఈ రీ ఓపెన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ కూడా నిర్ణయించారు. ఈ కేసు పునర్విచారణ అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేయనుంది తెలంగాణ పోలీస్‌శాఖ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles