
పదేళ్లుగా సంతానం కోసం ఆ దంపతులు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. ఎక్కని గుడి మెట్టు లేదు.. మొక్కని దేవుడు లేడు. చివరకు వారి నిరీక్షణ ఫలించింది. భార్య గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మరో నెల రోజుల్లో తమ బిడ్డను కళ్లారా చూడబోతున్నానని ఆ తండ్రి మురిసిపోయాడు. కానీ విధి వెక్కిరించింది. ఎనిమిది నెలల గర్భిణి భార్యను, పుట్టబోయే బిడ్డను ఒంటరిగా వదిలి ఆ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. కన్నబిడ్డను చూడకుండానే కాటికి వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్టేషన్ రోడ్డు కాలనీకి చెందిన విశ్రాంత సింగరేణి ఉద్యోగి యడమనూరి కొమురయ్య పెద్ద కుమారుడు సురేష్ (39) సింగరేణిలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి సురేష్ తన స్నేహితుడు గట్లె చిరంజీవితో కలిసి ద్విచక్ర వాహనంపై కన్నాల బస్తీ నుంచి బెల్లంపల్లి వైపు బయలుదేరాడు.
రోడ్డు మూలమలుపు వద్దకు చేరుకోగానే రెబ్బెన వైపు నుంచి వస్తున్న బొలేరో వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్ తల, నడుము, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న చిరంజీవికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.
సురేష్కు 2016లో సుష్మతో వివాహమైంది. పదేళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న ఈ దంపతులకు ఎట్టకేలకు శుభవార్త లభించింది. ప్రస్తుతం సుష్మ ఎనిమిది నెలల గర్భిణి. మరో నెల రోజుల్లో తమ బిడ్డను చూడబోతున్నామనే ఆనందంలో ఉన్న కుటుంబానికి ఇంతలోనే ఊహించని విషాదం ఎదురైంది. బిడ్డ పుట్టకముందే తండ్రి మృత్యువాత పడటంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.