గ్రూప్-1 మెయిన్స్ రాతపరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం నుంచి ఈనెల 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. 46 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 31,383 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు జరగనుండగా.. 12.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా గంట అదనపు సమయం కేటాయించారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో అన్ని కేంద్రాలకూ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపనుంది.
గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు ఈ అంశంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. గత పాలకులు నిరుద్యోగులను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్. పరీక్షల నిర్వహణతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి హరీష్రావు. జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని మాజీమంత్రి హరీష్రావు విమర్శించారు.
గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని… అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరోవైపు జీవో 29తో అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్. నిరుద్యోగులకు విపక్షాల ట్రాప్లో పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు.
మరోవైపు సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో గ్రూప్ -1పై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..