Telangana: గుజరాత్‌ విజయోత్సాహం.. ఇక తెలంగాణ రాష్ట్రంపైనే బీజేపీ పెద్దల ఫోకస్!

దేశ వ్యాప్తంగానూ బీజేపీ శ్రేణుల్లో గుజరాత్ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రకమైన ఫలితాలను రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు..

Telangana: గుజరాత్‌ విజయోత్సాహం.. ఇక తెలంగాణ రాష్ట్రంపైనే బీజేపీ పెద్దల ఫోకస్!
Telangana BJP
Follow us

|

Updated on: Dec 08, 2022 | 7:01 PM

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఏడుసార్లు..డబుల్‌ హ్యాట్రిక్..! ఐనా  మేనియా తగ్గలేదు. గత రికార్డులన్నీ తిరగరాస్తూ మరోసారి గుజరాత్‌లో బంపర్‌ మెజార్టీ సాధించింది కమలదళం. అక్కడ 27 యేళ్లుగా అధికారాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి మోదీనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైనా మోదీ మేనియా ముందు తేలిపోయారు. మునుపటికంటే ఓట్లు, సీట్లు పెరగడంతోపాటు బీజేపీ జోరు అమాంతం పెరిగిపోయింది. దేశ వ్యాప్తంగానూ బీజేపీ శ్రేణుల్లో గుజరాత్ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రకమైన ఫలితాలను రిపీట్ చేస్తామని చెబుతున్నారు.  అటు తెలంగాణ బీజేపీ శ్రేణులు కూడా ఈ ఫలితాల పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు. 2023లో తెలంగాణలో అధికారం మాదేనంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు.

గుజరాత్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టి ఊపుమీదున్న బీజేపీ…వరుసగా ఏడోసారి బంపర్‌ మెజార్టీతో విజయం సాధించింది. ఈ సారి ట్రయాంగిల్‌ ఫైట్‌ ఉన్నా, మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైనా , కులాల కుంపట్లు, ప్రాంతాల వారీగా పాలిటిక్స్ నడిపినా ప్రజలు గుజరాత్ వికాస్ నినాదానికే పట్టంకట్టారు. అభివృద్ధికి అవినీతికి జరుగుతున్న యుద్ధంగా ఈ ఎన్నికలను ప్రకటించిన మోదీ తన ప్రచారంతో విశేషంగా ఆకట్టుకున్నారు. మోదీ, అమిత్‌షా ద్వయం వ్యూహాలు, గుజరాత్‌ అభివృద్ధి వంటి ప్రచార అస్త్రాలు బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

గుజరాత్‌లోఈసారి బీజేపీ,కాంగ్రెస్‌,ఆప్‌ మధ్య హోరాహోరి పోటీ నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఢిల్లీ, పంజాబ్‌ను ఊడ్చేసి ఊపుమీదున్న ఆప్‌, ఈ సారి గుజరాత్‌ బరిలో దిగి గట్టి పోటీ ఇవ్వనుందనే ఊహాగానాలు వినిపించాయి. ఐతే మోదీ-షా ద్వయం మొదటి నుంచే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఏయే నియోజకవర్గాల్లో సమస్యలున్నాయో గుర్తించి వాటిని పరిష్కరిస్తూ ముందుకెళ్లారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్నచోట గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 38 మందికి పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చారంటే, బీజేపీ సాహసమైన నిర్ణయమే తీసుకుంది. ఎక్కడా వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడింది. పటేల్లా మద్దతు కూడగట్టడంలో పైచేయి సాధించారు. ముందుగానే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భూపేంద్ర పటేల్‌ను ప్రకటించారు.ప్రధాని మోదీ రోడ్‌షో బీజేపీకి బాగా కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా.

ఇవి కూడా చదవండి

బీజేపీకి గుజరాత్‌ కంచుకోట అయినప్పటికీ…సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో ఆ పార్టీకి బలం తక్కువే. పటేళ్లు, రైతుల ప్రాభవం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో బీజేపీ ఈసారి పుంజుకుంది. అటు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఎక్కువగా ఉండే సౌత్‌ గుజరాత్‌, సెంట్రల్‌ గుజరాత్‌లో కమలం పార్టీ మెజార్టీ స్థానాలు సాధించింది. మరోవైపు గుజరాత్ వాసులు కూడా మోదీని చూసే ఇక్కడ బీజేపీని ఆదరిస్తారనే ప్రచారం ఉంది. ఇక్కడ సీఎం అభ్యర్థి వాళ్లకు ప్రధానం కాదు. అక్కడ పార్టీనే ముఖ్యం.. మోదీనే నాయకుడు. అందుకే మోదీనే ముందుండి బీజేపీకి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. తనను ఇంతటి వాణ్ణి చేసింది మీరేనని.. మీ ఆదరణ వల్లే సీఎం నుంచి పీఎంగా ఎదిగానని సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు మోదీ.

1995 నుంచి గుజరాత్ కోటలో పాగావేస్తున్న బీజేపీ తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తూ ఏడోసారి విజయాన్నందుకోవడం విశేషం. మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉన్న గుజరాత్‌లో 1995లో బీజేపీ 121 స్థానాలు కైవసం చేసుకుంది. 1998లో 117 గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టింది బీజేపీ. 2002లో ఏకంగా 127 స్థానాల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధించింది. 2007లో నాలుగోసారి 117 స్థానాల్లో గెలిచింది బీజేపీ. 2012లోనూ 115 స్థానాల్లో జెండా ఎగురవేసింది బీజేపీ. ఆ తర్వాత మోదీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఢిల్లీకి మకాం మార్చారు. దేశంలో బీజేపీ అఖండ విజయం సాధించి, ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మోదీ. ఇక గుజరాత్‌లో బీజేపీ పనైపోయిందని అంతా భావించారు. కాంగ్రెస్‌ విజృంభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచాన వేశారు. అయితే ఆ తర్వాత జరిగిన 2017లో 99 స్థానాల్లో విజయం సాధించింది.

గుజరాత్ రిజల్ట్స్‌ బీజేపీలో సరికొత్త జోష్‌ నింపాయి. ఇవి జస్ట్ ట్రయల్స్ మాత్రమే.. 2024లోనూ ఇదే రిపీట్ అవుతుందని బల్లగుద్ది చెబుతున్నారు.! తెలంగాణలోనూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై తప్పనిసరిగా ఉంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే గుజరాతీ ప్రజలు భారీ మెజార్టీతో బీజేపీని గెలిపించారని చెప్పారు. గుజరాత్ ఫలితాలను తెలంగాణలోనూ రిపీట్ చేస్తామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు.

రాజకీయంగా తమకు అత్యంత కీలకమైన గుజరాత్‌లో ఎన్నికలు ముగియడంతో ఇక బీజేపీ అధిష్టాన పెద్దలు తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెడుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలను సిద్ధం చేయడంలో బీజేపీ అగ్రనేతలు ఇక తలమునకలు కానున్నాయి.   అయితే తెలంగాణలో బీజేపీ కొన్నిచోట్ల గెలవొచ్చేమోగానీ, తెలంగాణలో అంత సీన్‌ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వైఎస్‌ షర్మిల బీజేపీ వదిలిన బాణమేనన్నారు తమ్మినేని వీరభద్రం.

మొత్తానికి గుజరాత్‌లో ఈ సారి ట్రయాంగిల్‌ ఫైట్‌ నడిచినా…బీజేపీ హవాను ఆపలేకపోయింది. కాంగ్రెస్ ఓటమికి, బీజేపీ గెలుపుకు ఆప్ ఈసారి ప్రధాన కారణం కాబోతోందని విశ్లేషకులు భావించినట్లే గుజరాత్‌లో ఎన్నికల ఫలితాలు కనిపించాయి. చాలాచోట్ల ఆప్ అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..