మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. బంధాలను సెల్ఫోన్లకే పరిమితం చేస్తున్న యాంత్రిక జీవితంలో దగ్గరి బంధువులు కూడా ఒకరినొకరు పరిచయం చేసుకునే దుస్థితికి దిగజారింది. ప్రస్తుత రోజుల్లో ఆరు తరాలకు చెందిన 141 కుటుంబాలు ఒకే వేదికపై కలుసుకొని ఆనందాన్ని పంచుకున్నారు. ఆరు తరాల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన రాచకొండ వీరయ్య, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరయ్య, లక్ష్మమ్మ దంపతులు కిరాణా దుకాణం నడుపుతూ పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశారు.కుమారులు-కోడళ్లు, కుమార్తెలు-అల్లుళ్లు మనుమలు, మునిమనుమలు, మనవరాళ్లు ఇలా ఆరు తరాలకు చెందిన సంతానం.. మొత్తం ఈ కుటుంబంలో 411 మంది ఉన్నారు. వీరిలో చాలామంది వ్యాపారం చేస్తుండగా, పలువురు ఉద్యోగాల రీత్యా విదేశాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డారు.
ఏడేళ్ల క్రితం రాచకొండ వీరయ్య, లక్ష్మమ్మ దంపతులు మృతిచెందగా, వారి జ్ఞాపకార్ధం మట్టపల్లిలో వంశవృక్ష ఆత్మీయ వేడుక నిర్వహించారు. విదేశాలతో పాటు వివిధ రాష్ట్రాలలోని బంధు గణమంతా కదిలివచ్చి తమ అపూర్వ కలయికకు మూలమైన వంశాధిపతి దంపతులకు నివాళి అర్పించి ఆత్మీయ వేడుకలో 367మంది పాలు పంచుకున్నారు. మూడు నెలలుగా అందరికీ సమాచారం ఇస్తూ, అవసరమైన ఏర్పాట్ల చేసి ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నామని ఆ కుటుంబానికి చెందిన రాచకొండ శ్రీనివాసరావు తెలిపారు.