అన్నల వేటకు వెళ్లి అమరుడైన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్.. ఏం జరిగిందంటే..

| Edited By: Srikar T

Feb 12, 2024 | 10:13 AM

ఎంతోమంది అమాయకుల ప్రాణాలు భక్షిస్తున్న అటవీ జంతువుల వేట ఇప్పుడు ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రాణాలు బలి తీసుకుంది. అడవుల్లో అన్నల వేటకోసం వెళ్ళిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ విద్యుత్ షాక్‎కి గురై మృతి చెందారు. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగానికి ఈ విషాదం ఊహించని విధంగా మారింది.

అన్నల వేటకు వెళ్లి అమరుడైన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్.. ఏం జరిగిందంటే..
Greyhounds Constable
Follow us on

ఎంతోమంది అమాయకుల ప్రాణాలు భక్షిస్తున్న అటవీ జంతువుల వేట ఇప్పుడు ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రాణాలు బలి తీసుకుంది. అడవుల్లో అన్నల వేటకోసం వెళ్ళిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ విద్యుత్ షాక్‎కి గురై మృతి చెందారు. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగానికి ఈ విషాదం ఊహించని విధంగా మారింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్ పల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు. గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు అడవులను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. మహదేవపూర్, కాటారం, కాళేశ్వరం అడవులను అణువణువు గాలిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన సందర్భంగా అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఊహించని విషాద సంఘటన చోటుచేసుకుంది. అటవీ జంతువులను హతమార్చడం కోసం స్మగ్లర్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ప్రవీణ్ అనే గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‎కు గురై మృత్యువుతో పోరాడుతున్న కానిస్టేబుల్‎ను భద్రతా బలగాలు ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు. కానిస్టేబుల్ ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయారు. డెడ్ బాడీని భూపాలపల్లి జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు అదిలాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. భూపాలపల్లి జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్దకు పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఈ విషాద సంఘటన నేపథ్యంలో సీఎం బందోబస్తు చర్యల నిమగ్నమైన పోలీసులు అయోమయంలో పడ్డారు. అటవీ జంతువుల కోసం అమర్చే ఉచ్చులు, విద్యుత్ వైర్లు అమాయక ప్రజల ప్రాణాలతో పాటు ఎంతో మంది పోలీసుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, సహచర సిబ్బంది కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..