Telangana: ‘నాన్నా.. ఎలాగైనా నన్ను కాపాడు’ తండ్రితో బాలిక చివరి మాటలు! ఏం జరిగిందంటే

|

Aug 11, 2024 | 11:40 AM

రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలకు మరో బాలిక మృత్యువాత పడింది. హాస్టల్‌లో చదువుకుంటున్న ఓ టెన్త్‌ విద్యార్థిని తీవ్ర జ్వరంతో ప్రాణాలతో పోరాడిన విధానం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. 'నాన్నా.. నన్నెలాగైనా కాపాడు' తండ్రితో పలికిన చివరి మాటలు కన్నపేగును మెలిపెట్టాయి. ఆ తండ్రి కూతురిపి బతికించుకోవడానికి సర్వశక్తులా ఒడ్డాడు. కానీ విధి అంతలోనే ఆయువు తీసి కడుపుకోత మిగిల్చింది..

Telangana: నాన్నా.. ఎలాగైనా నన్ను కాపాడు తండ్రితో బాలిక చివరి మాటలు! ఏం జరిగిందంటే
16 Year Old Student Died Due To Viral Fever
Follow us on

కౌటాల, ఆగస్టు 11: రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలకు మరో బాలిక మృత్యువాత పడింది. హాస్టల్‌లో చదువుకుంటున్న ఓ టెన్త్‌ విద్యార్థిని తీవ్ర జ్వరంతో ప్రాణాలతో పోరాడిన విధానం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ‘నాన్నా.. నన్నెలాగైనా కాపాడు’ తండ్రితో పలికిన చివరి మాటలు కన్నపేగును మెలిపెట్టాయి. ఆ తండ్రి కూతురిపి బతికించుకోవడానికి సర్వశక్తులా ఒడ్డాడు. కానీ విధి అంతలోనే ఆయువు తీసి కడుపుకోత మిగిల్చింది. కుమార్తె మృతిని తట్టుకోలేకపోయిన తండ్రి.. ‘నిన్ను కాపాడుకోలేక పోయిన బిడ్డా’అంటూ గుండెలవిసేలా రోదించాడు. ఈ విషాద ఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గుండాయిపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గుండాయిపేటరే చెందిన జాడె కిశోర్, సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజ (16) ఆసిఫాబాద్‌లోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలికల వసతిగృహంలో ఉంటూ పదో తరగతి చదువుతుంది. హాస్టల్‌ జ్వరం రావడంతో గత శనివారం తండ్రికి ఫోన్‌ చేసి.. ‘నాన్నా జ్వరమొచ్చింది. చేతనైతలేదు. కాళ్లు చేతులు గుంజుతున్నయ్‌. ఇంటికి తీసుకుపో’అని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. స్థానిక ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం పరిస్థితి మరింత విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మార్గం మధ్యలో పూజ తన తండ్రి చేయి పట్టుకొని తనను కాపాడాలని కోరింది. ఏమీ కాదని తంద్రి ధైర్యం చెప్పాడు. కానీ కాసేపటికే పూజ మరణించింది. పూజ మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా గత కొంత కాలంగా గుండాయిపేట గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఉన్నారు. తాజాగా పూజ మృతివార్తతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు తీవ్ర జ్వరాలతో మంచిర్యాల, కరీంనగర్‌ పట్టణాల్లోని ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. జ్వరాల నియంత్రణకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.