
తక్కువ ధరలోని వినియోగదారులకు అద్భుతమైన పరికరాలు అందించడంలో రిలయన్స్ ముందుంటుంది. ఇప్పటికే అత్యంత చవకైన ధరలకే జియో ఫోన్ , 4జీ నెట్ వర్క్ తో పాటు అనేక రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్లను తీసుకొచ్చిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో కొత్త పరికరాన్ని లాంచ్ చేసింది. ఇది ట్రాకింగ్ గాడ్జెట్. దీనిని జియోట్యాగ్ అని పిలుస్తారు. ఈ కొత్త పరికరాన్ని ఉపయోగించి, వినియోగదారులు మర్చిపోయిన వస్తువులను గుర్తించవచ్చు. ఇది యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్ ట్యాగ్ కి చౌకైన ప్రత్యామ్నాయం. ఈ జియోట్యాగ్ బ్లూటూత్ని ఉపయోగించి వస్తువులను ట్రాక్ చేయగలుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
తరచూ మర్చిపోయే వస్తువులకు దీన్ని తగిలించాలి. బ్లూ టూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసిన జియో థింగ్స్ యాప్ కి కనెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు జియో ట్యాగ్ తగిలించిన వస్తువును వదిలి నిర్ధేశిత దూరం దాటి వెళ్లిపోతే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇండోర్ లో 20 మీటర్లు, అవుట్ డోర్లో అయితే 50 మీటర్ల వరకూ జియో ట్యాగ్ పనిచేస్తుంది. దీంట్లో మార్చుకోదగిన సీఆర్2032 బ్యాటరీ ఉంది. దీనికి ఏడాది వారంటీ ఉంటుంది. జియో ట్యాగ్ పరికరాలను సులభంగా అటాచ్ చేసేలా ఒక కేబుల్ కూడా అందిస్తున్నారు. జియో ట్యాగ్ ద్వారా స్మార్ట్ ఫోన్ కూడా ట్రాక్ చేయొచ్చు. సైలెంట్ మోడ్ లో ఉన్నప్పటికీ జియో ట్యాగ్ రెండు సార్లు ట్యాప్ చేస్తే ఫోన్ మోగుతుంది.
పరికరాల ట్రాకింగ్ తో పాటు జియో ట్యాగ్ తీసుకున్న వారికి జియో ఒక ప్రత్యేక సేవలను అందిస్తోంది. జియో ట్యాగ్ తగిలించిన పరికరాన్ని ఎవరైనా దొంగిలిస్తే దాన్ని జియో థింగ్స్ యాప్ లోని జియో కమ్యూనిటీలో రిపోర్టు చేయొచ్చు. తద్వారా పరికరం చివరిసారి నెట్ వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాన్ని ఫోన్కు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది.
జియోట్యాగ్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 2,199గా జియో పేర్కొంది. అయితే ప్రస్తుతం వెల్ కమ్ ఆఫర్ కింద కేవలం రూ. 749కే అందిస్తోంది. జియ, రిలయన్స్ డిజిటల్ వెబ్ సైట్లలో ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. దాదాపు ఇదే ఫీచర్స్ తో ఉన్న యాపిల్ ఎయిర్ ట్యాగ్ ధర రూ. 3,490గా ఉంది. రిలయన్స్ జియో ట్రాకర్, జియోట్యాగ్, ఒక సంవత్సరం వరకు బ్యాటరీ బ్యాకప్ను అందించగలదని కంపెనీ పేర్కొంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..