ఆండ్రాయిడ్ యూజర్లకు అదిరిపోయే గుడ్న్యూస్! సూపర్ ఫీచర్ తెస్తున్న గూగుల్
స్మార్ట్ఫోన్లలో ఫైల్ షేరింగ్ను మరింత వేగవంతంగా, సులభంగా మార్చడానికి గూగుల్ 'ట్యాప్-టు-షేర్' అనే కొత్త ఫీచర్ను ఆండ్రాయిడ్ 17లో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ ద్వారా రెండు ఆండ్రాయిడ్ ఫోన్లను దగ్గరగా ఉంచడం ద్వారా క్షణాల్లో ఫైళ్లను పంపుకోవచ్చు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ఫైల్ షేరింగ్ను మరింత వేగవంతంగా, సులభంగా మార్చే దిశగా గూగుల్ కీలక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తాజా లీకుల ప్రకారం ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ట్యాప్-టు-షేర్ అనే కొత్త ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. ఇది రాబోయే ఆండ్రాయిడ్ 17లో భాగంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న క్విక్ షేర్ టూల్ను మరింత సులభతరం చేయడం ఈ ఫీచర్ లక్ష్యంగా ఉంది. ఈ ఫీచర్ ద్వారా రెండు ఆండ్రాయిడ్ ఫోన్లను దగ్గరగా తీసుకురాగానే ఫైళ్లను తక్షణమే పంపించుకునే వీలు కలుగుతుంది. ఇప్పటి వరకు డివైజ్ల జాబితా నుంచి ఎంపిక చేయడం లేదా పెయిరింగ్ ప్రక్రియలో ఉండే ఆలస్యం వంటి సమస్యలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.
డెవలపర్లు ఇప్పటికే దీని ప్రారంభ వెర్షన్లను గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా One UI తాజా వెర్షన్లలో ట్యాప్ టూ షేర్ అనే ఆప్షన్ కనిపించడం ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానున్న సంకేతంగా భావిస్తున్నారు. సాంకేతికంగా ఈ ఫీచర్ పనిచేసే విధానం కూడా ఆసక్తికరంగా ఉంది. రెండు పరికరాలు దగ్గరగా వచ్చినప్పుడు NFC టెక్నాలజీ ద్వారా అవి ఒకదానిని ఒకటి గుర్తిస్తాయి. అయితే అసలు డేటా బదిలీ మాత్రం బ్లూటూత్ లేదా వై-ఫై డైరెక్ట్ వంటి వేగవంతమైన కనెక్షన్ల ద్వారా జరుగుతుంది. దీంతో ఫైల్ ట్రాన్స్ఫర్ వేగం గణనీయంగా పెరగనుంది.
ఈ కొత్త ఫీచర్ రూపకల్పనలో యాపిల్ ఎయిర్డ్రాప్ వంటి టెక్నాలజీల ప్రభావం కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని గెలాక్సీ పరికరాల్లో ఇలాంటి ఫీచర్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు గూగుల్ దాన్ని మొత్తం ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్కు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. మొత్తంగా చూస్తే ట్యాప్-టు-షేర్ ఫీచర్ అమల్లోకి వస్తే ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఫైల్ షేరింగ్ మరింత వేగంగా, సులభంగా మారే అవకాశం ఉంది. పరికరాల మధ్య డేటా మార్పిడిని సులభతరం చేస్తూ, యూజర్ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే ఫీచర్గా ఇది నిలిచే అవకాశముంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
