AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రీగా ఇచ్చినా ఎందుకు తినరు! మన చెరువుల్లో దొరికే ఈ దెయ్యం చేప గురించి తెలుసా?

అక్వేరియం చేపగా ప్రవేశించిన ఇది స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. వలలను పాడుచేయడంతో పాటు, స్థానిక చేప జాతులకు ముప్పుగా మారింది. ఇది పర్యావరణ సమతుల్యతను కూడా దెబ్బతీసి, జలచర జీవితానికి సవాలు విసురుతోంది. ఈ దెయ్యం చేప గురించి పూర్తిగా తెలుసుకుందాం..

ఫ్రీగా ఇచ్చినా ఎందుకు తినరు! మన చెరువుల్లో దొరికే ఈ దెయ్యం చేప గురించి తెలుసా?
Suckermouth Catfish
SN Pasha
|

Updated on: Jul 07, 2026 | 6:12 PM

Share

కొంతకాలంగా మన తెలుగు రాష్ట్రాల్లోని చెరువుల్లో ఒక అరుదైన చేప కనిపిస్తూ ఉంది. దాన్ని స్థానికులు దెయ్యం చేప అని పిలుస్తుంటారు. ఎందుకంటే అది చూసేందుకు భయంకరంగాను, తినేందుకు పనికి రాదని దాన్ని అలా పిలుస్తుంటారు. గ్రామాల్లోని చెరువుల్లో చేపలు పెంచి, వాటిని పట్టి అమ్ముకునే మత్స్యకారులు సైతం ఆ చేపలు వలలో పడితే వడ్డున పడేస్తుంటారు. ఛీ.. ఇదెక్కడి చేపరా బాబు అంటూ తిట్టుకుంటూ ఉంటారు. చేపలు ఇష్టంగా తినేవారు.. ఈ చేపలను ఫ్రీగా ఇచ్చిన తినరు. కొన్ని చెరువుల వడ్డున ఇలాంటి చేపలు కొన్ని వందల కిలోలు అలా పడి ఉంటాయి. వాటిని ఎవరూ ముట్టుకోరు. అసలు ఆ చేప కథేంటి? దాని అసలు పేరేంటి? దాన్ని ఎందుకు తినరు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఈ చేపను సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అంటారు. ఇది అమెజాన్ పరీవాహక ప్రాంతంలో పుట్టింది. మరి మన దేశానికి ఎలా వచ్చింది అంటే దాని వెనుక ఒక కథ ఉంది. ఈ విదేశీ చేప భారత్‌కు అక్వేరియం పరిశ్రమ ద్వారా పరిచయమై, ప్రస్తుతం ఒక తీవ్రమైన ఆక్రమణ జాతిగా మారింది. ఈ సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్‌లు అధికంగా పెరిగిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ చేపలకు ఉన్న పదునైన ముళ్ల వల్ల మత్స్యకారుల చేతులకు తరచూ గాయాలు అవుతూ ఉంటాయి. అంతేకాకుండా వలలో చిక్కుకున్న ఈ చేపలను బయటికి తీసేందుకు కొన్నిసార్లు వలను బ్లేడ్‌తో కోయాల్సి వస్తోంది. ఇది వలలకు నష్టం కలిగించడంతో పాటు, మత్స్యకారుల ఆర్థిక భారాన్ని పెంచుతోంది.

ఈ చేపల వల్ల మరొక ప్రధాన సమస్య మార్కెట్ లేకపోవడం. 2021 నుంచి ఈ చేపలు కనిపించినప్పుడు, దానికి ఉన్న ముళ్ల కారణంగా ఎవరూ కొనకపోవడంతో వాటిని పారేసేవారు. ప్రస్తుతం కొన్ని పరిశ్రమలు కేజీకి కేవలం రూ.5 చెల్లించి ఈ చేపలను కొనుగోలు చేస్తున్నాయి. వీటిని ఫిష్ ఆయిల్, ఫిష్ పౌడర్‌గా వాడుతున్నారు. అయితే సాధారణ ప్రజలు దీన్ని తినేందుకు మాత్రం తీసుకోరు. అసలు దాన్ని ఫ్రీగా ఇచ్చిన ఎవరూ తీసుకొని, వండుకొని తినరు.

శాస్త్రవేత్తల ప్రకారం.. సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ భారత్‌కు చెందినది కాదు. అమెజాన్ పరివాహక ప్రాంతానికి చెందిన ఈ చేపలను అక్వేరియంలను శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయని, అక్వేరియంలలో పెంచుకునే చేపలుగా తీసుకువచ్చారు. కానీ, అది చివరికి మన గ్రామాల్లోని స్థానిక చెరువుల్లోకి కూడా చేరిపోయింది. దీనికి ఉండే అధిక సంతానోత్పత్తి కారణంగా ఈ జాతి చేపలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చేపలు సాధారణంగా ఎవరూ తినరు. నీటి నుంచి బయటకు తీసిన తర్వాత కూడా ఇవి చాలా సేపు బతికి ఉంటాయి. వీటి నోరు లోపలికి పీల్చుకునేలా ఉంటుంది. ఆ నోటితో ఇవి నీటి అడుగు భాగంలో ఉన్న మొక్కలను, సేంద్రియ పదార్థాలను ఆహారంగా తింటుంటాయి.

ఈ ప్రక్రియలో ఇవి నది లేదా సరస్సుల అడుగు భాగాన్ని కదిలించి నీళ్లను బురదగా మారుస్తాయి. దీనివల్ల నీటిలోకి సూర్యరశ్మి చొచ్చుకుపోవడం తగ్గిపోయి నీటి మొక్కల పెరుగుదల దెబ్బతింటుంది. చాలా చేపల జాతులు తమ పిల్లలను పెంచడానికి ఈ మొక్కలపైనే ఆధారపడతాయి కాబట్టి, సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ పరోక్షంగా స్థానిక చేప గుడ్ల మనుగడపై ప్రభావం చూపుతుంది. సక్కర్ మౌత్ చేపలు భారీగా పెరిగిపోవడానికి మరో కారణం ఏంటంటే, అవి ఎలాంటి పరిస్థితుల్లోనైనా బతకగలవు, ఎలాంటి ఆహారాన్నైనా తినగలవు. అందుకే స్థానిక చేపల జాతులకు ఆహార వనరులు దొరక్క వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.

Follow Us