Airtel: ఎయిర్టెల్ కస్టమర్లకు బిగ్ షాక్.. పెరిగిన రీఛార్జ్ ధరలు.. కొత్త రేట్లు ఇవే..
ఎయిర్టెల్ తన యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. తన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను సవరించడంతో పాటు ఫ్రీ క్యాష్బ్యాక్ ప్రయోజనాలను సైలెంట్గా తొలగించింది. రోజురోజుకు పెరుగుతున్న ఈ రీఛార్జ్ ధరలు సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఎయిర్టెల్ కొత్త ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం..

ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. తన పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడమే కాకుండా అందులో లభించే కొన్ని కీలక ప్రయోజనాలను సైలెంట్గా తొలగించింది. దేశంలో మొబైల్ టారిఫ్లు తక్కువగా ఉన్నాయని కంపెనీ యాజమాన్యం చెబుతున్నప్పటికీ వరుస పెంపులు సాధారణ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ తన అత్యంత ఆదరణ పొందిన రూ. 859 ప్లాన్ ధరను రూ. 899కి సవరించింది. ఇందులో లభించే 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటిలో మార్పు లేనప్పటికీ.. ఒక ప్రధాన ప్రయోజనాన్ని కంపెనీ కట్ చేసింది. గతంలో ఈ ప్లాన్తో లభించే రివార్డ్స్మినీ సబ్స్క్రిప్షన్ను ఎయిర్టెల్ తొలగించింది. దీనివల్ల వినియోగదారులు ప్రతి నెలా పొందే రూ.80 క్యాష్బ్యాక్ ప్రయోజనాన్ని కోల్పోనున్నారు.
రూ. 799 ప్లాన్ రద్దు.. తగ్గిపోయిన ఆప్షన్లు
బడ్జెట్ ధరలో 1.5GB డేటాను కోరుకునే వారి కోసం అందుబాటులో ఉన్న రూ. 799 ప్లాన్ను ఎయిర్టెల్ పూర్తిగా రద్దు చేసింది. ఈ ప్లాన్లో 77 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ SMSలు లభించేవి. దీంతో తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఆప్షన్స్ తగ్గిపోయాయి. మీకు రోజుకు 2GB డేటా, ఓటీటీలు కావాలంటే, ఇప్పుడు రూ.1029 ప్లాన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అపరిమిత 5G, 3 నెలల జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే దీని కోసం వినియోగదారులు మునుపటి కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది.
వరుసగా పెరుగుతున్న ధరలు
ఎయిర్టెల్ గత కొద్ది నెలలుగా తన ప్లాన్లలో అనేక మార్పులు చేస్తూ వస్తోంది.
నవంబర్ 2025: రూ. 189 ఎంట్రీ లెవల్ ప్లాన్ రద్దు. ఇప్పుడు కనీస ప్యాక్ రూ.199 నుండి ప్రారంభం.
అంతర్జాతీయ రోమింగ్: ఈ ఏడాది ప్రారంభంలో రూ.4,000గా ఉన్న ధరను ఏకంగా రూ. 4,999కి పెంచేసింది.
ఎయిర్టెల్ చేస్తున్న ఈ మార్పుల వల్ల దీర్ఘకాలిక ప్లాన్ల ధరలు భారీగా పెరిగాయి. కొన్ని చిన్నపాటి అదనపు ప్రయోజనాలను తొలగించడం వల్ల వినియోగదారులపై పరోక్షంగా భారం పడుతోంది. ఎయిర్టెల్ లో రీఛార్జ్ చేసే ముందు జియో లేదా విఐ వంటి ఇతర కంపెనీల ప్లాన్లను ఒకసారి సరిచూసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
